ఫ్యూచర్ సిటీపై బీఆరెస్ లేపిన గందరగోళానికి తెర వేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీన్ని మేం అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని పదే పదే ప్రకటిస్తూ తీవ్ర అయోమయానికి గురి చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టారాయన. ఆ పార్టీకిక ఫ్యూచర్ లేదని జోస్యం చెప్పారు. బీఆరెస్ పార్టీ గతం ఘనం.. ఫ్యూచర్ శూన్యమని అభివర్ణించారు. బీఆరెస్ వాడిన ఫ్యూచర్ పదాన్ని వారికే తిప్పి కొట్టారు సీఎం. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి.. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాడంట.. అని ఎగతాళి చేసిన వారికి.. ఆ పార్టీకే ఫ్యూచర్ ఇక లేదని కౌంటర్ ఇచ్చారు.
ఫ్యూచర్ లేని పార్టీ నేతలు చెప్పే మాటలను పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం.. ఈ వేదికగా జనాలకు క్లారిటీ ఇవ్వడమే కాదు.. అయోమయాన్ని క్రియేట్ చేసి రాజకీయంగా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులపై విరుచుకుపడ్డారు. రద్దయిన వెయ్యినోటులాంటి ఆ నేతల మాటలు చెల్లని రూపాయికి గీతలెక్కువ అన్నట్టుగానే ఉంటాయన్నారు. ఓ వైపు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు తమను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని ముందుకు వస్తుంటే.. పేదల అభివృద్దిని భరించలేక, అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ పోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వాళ్లు నవ్వుతూనే ఉంటారు. మనం డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతూనే ఉండాలన్నారు. నవ్వేటోని ముందు జారిపడొద్దన్నారు. హైటెక్ సిటీ అంటే అప్పుడు కూడా నవ్వుకున్నారు. ఇప్పుడు సిటీ రూపురేఖలు ఎలా మారాయో మనం చూస్తున్నాం.. ఇక్కడ కూడా నేల బంగారమైపోయింది. ఇక్కడి ప్రజల జీవితాలు బంగారుమయం కాబోతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్లలో నగరాన్ని పూర్తిగా దోచుకున్న బీఆరెస్ నేతలు.. చెరువులను, కుంటలను ఆక్రమించారని, అందుకే ఒక్క గంట వానకే సిటీ అల్లకల్లోలమైందన్నారు.
సిటీని చక్కదిద్దేందుకు ఆక్రమణలన్నీ కూల్చేస్తున్నామన్ని, ఎవరినీ వదలిపెట్టబోమన్నారు. మళ్లీ ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ వస్తున్నామని, ప్రజల సహకారం అవసరమన్నారు. హైదరాబాద్ పేరు ఎలా అయితే బ్రాండ్గా నిలిచిందో.. భవిష్యత్తులో కూడా ఈ ఫ్యూచర్ సిటీ తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ను సొంతం చేసుకుని భావితరాలకు బంగారు ఫ్యూచర్ను అందిస్తుందన్నారు. అందరి అభివృద్ధిని కాంక్షించే ఈ ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, కాలుష్యం లేని వాతావరణం, పెద్ద కంపెనీల ఏర్పాటు, విద్యా సంస్థలు నెలకొల్పడం.. ఇవన్నీఅన్ని వర్గాల మేలు కోరి చేస్తున్నవే అన్నారు.
వీలైనప్పుడల్లా నేనొస్తా.. వారంకోసారి భట్టి విక్రమార్క, శ్రీధర్బాబులు ఇక్కడ ఆఫీసులో వచ్చి కూర్చుంటారని, స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తారని అన్నారు. బీఆరెస్ అన్నట్టుగా ఇక్కడ ఫార్మా కంపెనీలు రాబోవని ఈ వేదికగా సీఎం పరోక్ష సంకేతాలిచ్చారు. ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్కు వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్రజల్లో భరోసా నింపారు. బీఆరెస్ పని ఖతమైందని, దానికే ఇక ఫ్యూచర్ లేదని జోస్యం చెప్పారు.