తమ ప్రభుత్వం ఓడిపోగానే తెలంగాణ భవన్ ఓ జనతా గ్యారేజ్ అని ప్రకటించుకున్నాడు కేటీఆర్. ఇక్కడికి జనం ఎప్పుడైనా రావొచ్చు.. తమ బాధలు చెప్పొచ్చు.. మేము మీకు అండగా ఉంటామన్నాడు. ఆ తరువాత వారు ప్రెస్మీట్లు పెట్టేందుకే అక్కడ పోటీలు పడుతున్నారు. ఇక జనం గోడు పట్టించుకునేవారే లేరు.
ఆ తరువాత తమ గాంధీభవన్ జనతా గ్యారేజ్ అన్నాడు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. జనం ఎప్పుడైనా ఎవరైనా రావొచ్చు.. ఇక్కడికే మంత్రులను పిలిపిస్తా.. మీరు వచ్చి మీ బాధలు చెప్పుకోవచ్చన్నాడు. ఆ తరువాత ముఖం చాటేశాడు. ఇప్పుడు మళ్లీ అదే గాంధీ భవన్ జనతా గ్యారేజ్ అయ్యింది. అక్కడ రిపేరు చేస్తున్నది టీపీసీసీ అధ్యక్షుడు కాదు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్. అక్కడ జనం గోడు వినడానికి కాదు ఆమె వచ్చింది. అదిప్పుడు జనం బాధలు పట్టించుకునే తెలంగాణ భవన్ కాదు. ఆ పార్టీ నేతల పంచాది తీర్చుకునే రచ్చబండ. అదే.. జనతా గ్యారేజ్.
జనతా గ్యారేజ్ అనే బదులు నేతల గ్యారేజ్ అని అనాలేమో. ఇక్కడ నేతలను రిపేరు చేయబడును అనే క్యాప్షన్ కూడా రాయాలేమో. ఈ టాపిక్ ఎందుకంటే.. ఈ మధ్య కాంగ్రెస్ నేతల కయ్యాలు ఎక్కువయ్యాయి. రోడ్లెక్కి కొట్టుకుంటున్నారు. బాహాటంగానే తిట్టుకుంటున్నారు. నువ్వెంత..? అంటే నువ్వెంత అని తిట్లలో పోటీలు పడుతున్నారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో…! నాకేం కాదు.. నన్నెవరూ ఏమీ అనరు..! అని ముఖం మీదే అనేసుకుంటున్నారు.
ఏ పార్టీ నుంచి వచ్చినవయ్యా నువ్వు.. ఏ ఊరు నీది అని పుట్టు పూర్వోత్తరాలు, లోతులు లాగుతున్నారు. నాది కాంగ్రెస్ అంటే.. నాదే కాంగ్రెస్ అని ఓన్ చేసుకునే ప్రయత్నంలో.. పదవులు కాపాడుకునే యుద్దంలో, ప్రొటోకాల్ పాటించలేదనే రచ్చలో బజారుకెక్కి కొట్టుకుంటున్నారు. ఇంత జరిగినా సీఎం సైలెంట్. పీసీసీ చీఫ్ ఎంచక్కా .. వారి నుంచి వినతులు తీసుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. సరే, సరే మాట్లాడుతా.. పెద్దలకు విషయం చెబుతానంటున్నాడు. తనే ఓ పెద్ద అనే విషయం బహుశా మరిచిపోయినట్టున్నాడు.
దీంతో మీనాక్షి రంగ ప్రవేశం చేశారు. ఇలా కయ్యాల కాపురాన్ని చక్కదిద్దే పనిని చేపట్టారు. గాంధీ భవన్లోనే కొట్టుకుంటారు. కుర్చీ కోసం తన్నుకుంటారు. అయినా ఇక్కడి నేతలు పట్టించుకోరు. మీనాక్షమ్మే రావాలి. గుడ్లురుమాలి. నచ్చజెప్పాలి. బుజ్జగించాలి. తొడపాశం పెట్టాలి.ఆయింట్మెంట్ రాయాలి.. మొత్తానికి దారికి తేవాలి. మళ్లీ వీళ్లు ఎప్పుడు తన్నుకుంటారో తెలియదు. ఇప్పటి వరకైతే.. అదే జనతా గ్యారేజీ నుంచైతే రిపేరైన బండి లెక్కనే బయటకు వెళ్తారు.
ఆ తరువాత మూడ్ను బట్టి ఉంటుంది. అక్కడి పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు. ఏమాత్రం అటూ ఇటైనా మళ్లా ఆ బండ్లు గ్యారేజీకే వస్తాయి. కానీ ఇక్కడ రిపేరు చేయడానికి మాత్రం ఇంటి మెకానిక్ పనికి రాడు. బహుశా వాళ్ల మాటలు ఎవరూ వినరేమో..? అందుకే మీనాక్షమ్మ వచ్చి రిపేరు చేసి .. పంపిస్తుంది. ఇప్పుడు బండ్లన్నీ గ్యారేజికి లైన్ కడుతున్నాయట. రిపేరు పని కూడా ఎక్కువైనట్టుంది మెకానిక్కు. మరి ఈ బండ్ల రిపేర్లే చేసుకుంటూ కూసుంటే.. జనం బతుకు బండ్లు ఎప్పుడు బాగు చేస్తారు అధ్యక్షా? అని కూడా అడుతున్నారట.. కొందరు.
ముందైతే మన బండ్లు సక్కగా రోడ్డెక్కని.. టైమ్ ఉంది కదా.. అప్పటి వరకు జనం బతుకు బండ్లను పరిశీలిద్దాం.. మనకు అధికారం ఇవ్వడానికి ఇన్నేండ్లు తీసుకోలేదా .. తెలంగాణ ఇచ్చినంక కూడా. వాళ్లూ కొంచెం ఓపిక పట్టాలె అంటున్నాయట.. జనతా గ్యారేజ్ వర్గాలు.