ఎమ్మెల్సీ విజయశాంతి చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకెక్కారు. ఆమె ఫైర్ బ్రాండ్గా సినిమాల్లో పేరు సంసాదించినట్టుగా.. రాజకీయాల్లో కూడా అదే పేరు నిలబెట్టుకోవాలనే తాపత్రయం కనిపిస్తూ ఉంటుంది. కానీ రీల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్ వేరు. అందుకే ఈమె సినిమాల్లో సక్సెసయ్యారు కానీ.. రాజకీయాల్లో కాలేకపోయారు. అన్ని పార్టీలు మారి ఆమె కాంగ్రెస్ పంచన చేరిన తరువాత చాలా రోజులకు పోరాడి ఎమ్మెల్సీని ఎలాగోలా సాధించుకోగలిగారు. కానీ ఆమె టార్గెట్ మంత్రి పదవి.
తెలంగాణ కోసం ఓ పార్టీని స్థాపించిన చరిత్ర.. అంతకు ముందు సినీ గ్లామర్, విప్లవాత్మక భావాల సినిమాల నేపథ్యం.. ఇవ్వన్నింటినీ ఆమె తనను తాను గొప్పగా ప్రజెంట్ చేసుకునేందుకు ఉపయోగించుకునే ప్రయత్నం చేసినా.. అది రాజకీయంగా వర్కవుట్ కాలేదు.కేసీఆర్పై అసంతృప్తితో ఉన్న నేతలందరినీ లాగారు అప్పుడు కాంగ్రెస్ లోకి. కొందరు రేవంత్తో మాట్లాడుకుని వచ్చారు. మరికొందరు నేతలు రాహుల్, ఢిల్లీ పెద్దలతో ఉన్న పరిచయాలతో తమకు పదవులు ఇవ్వాలనే ఓకండిషన్ పెట్టి చేరారు. ఇలా చాలా మంది కాంగ్రెస్ గూటికి చేరారు.
రాజకీయ పరిస్థితులు కూడా..ఇక బీఆరెస్ పని ఖతమైంది. కేసీఆర్ నియంతృత్వ పాలనపై అంతా విసిగిపోయారు. రాష్ట్రం విడిచి దేశం బాట పట్టిన కేసీఆర్ ఇక మనఖక్కరలేదు.. అని జనం బాహాటంగానే చెబుతూ వచ్చారు. దీంతో అందరికీ గురి కుదిరింది. ఎలాగైనా ఈసారి కాంగ్రెస్ వస్తుందని, తమకు ఆశించిన పదవులు దొరకుతాయని. అంతా అనుకున్నట్టే అధికారం వచ్చింది కానీ.. పదవులు మాత్రం మాటిచ్చిన అందరికీ రాలేదు. పెండింగ్లో పెట్టారు. తమను తాము గొప్పగా ఎలివేట్ చేసుకున్న వారికి మాత్రం ఇది అవమానంగా తోచింది. అందుకే రేవంత్ పాలన ఓ అసహనంగా కనిపించడం మొదలుపెట్టింది.
అవకాశం వచ్చిన ప్రతీసారి లోపాలను వెతికిపట్టి.. దాన్ని చిలువలు పలువలుగా చేసి, బాహాటంగా బయటపెట్టి.. ఓ రకంగా కాంగ్రెస్ పాలన ఇజ్జత్ తీసి.. బెదిరింపు రాజకీయాలకు దిగితే గానీ అనుకున్నది సాధించలేమని అనుకుంటున్నారు. అదే అమలు చేస్తున్నారు. ఈ కోవలో ఇప్పుడు విజయశాంతి చేరారు. ఇప్పుడు ఆమె గురించే మనం చెప్పుకుంటున్నది. ఎమ్మెల్సీ అతికష్టం మీద తెచ్చుకున్న విజయశాంతి.. ఇక తనకు మంత్రి పదవి ఖాయమని భావించారు.
కానీ అక్కడ ఆ పరిస్థితులు కనిపించకపోయే సరికి తీవ్ర అసహనానికి గురైనట్టుగానే ఆమె మాటలున్నాయి. ఉద్యమకారుల ఇష్యూపై ఆమె మండలిలో మాట్లాడిన తీరు కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్టుగా ఉంది. ఆ తరువాత ఆమె పట్ల రేవంత్ సహా అంతా గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్లో బెదిరింపు రాజకీయాలు నడవవు. అవి ప్రయోగిస్తే..అసలుకే మోసం వస్తుంది. ఇక్కడ విజయశాంతి ప్రయోగం కూడా వికటించింది. కానీ ఆమె మళ్లీ చాలా రోజులకు మళ్లీ అవే మాటలతో బయటకు వచ్చారు.
షాబాద్లో ఆరుగురిని చంపిన ఉన్మాది రాజ్కుమార్ ఉదంతంలో పోలీసులు లంచం తీసుకోవడం వల్లే ఇదంతా జరిగిందని ఆమె ప్రకటించేశారు. ఇలా జరిగడం వల్లే అలా జరిగిందనే విధంగా ఆమె ఇందులో పోలీసులను ముందు పెట్టి.. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలనుకున్న వ్యూహం అమలు చేశారు. మరి ఇప్పటికైనా మంత్రి పదవి ఇస్తారా? ఓ వైపు రేవంత్ ఢిల్లీ టూర్లో ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణకు వేళాయెరా.. అని మళ్లీ ప్రచారం ఊపందుకున్నది. ఇక్కడ విజయశాంతి తన కర్తవ్యాన్ని తాను నిర్విగ్నంగా చేస్తున్నారు అమాత్య పదవి కోసం.. ! అనే చర్చ జరుగుతున్నది