అనుకున్నంత ఈజీగా ఏం లేదు ఫీల్డులో. మళ్లీ మనమే మళ్లీ మనమే.. రాస్కోరా సాంబా అన్నంతగా అనుకూల వాతావరణమైతే లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్సే గ్రహించింది. అధిష్టానానికి మెసేజ్ చేరవేసింది. ఒక్క బీఆరెస్ పార్టే కాదు.. బీజేపీ కూడా బలపడుతోంది రాష్ట్రంలో అని తెలుసుకున్నది. తేల్చుకునేందుకు రెడీగా ఉండాలె. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు అనే సందేశం చేరింది ఢిల్లీకి.
పదేండ్లు అధికారం అనుభవించి ఓడిన బీఆరెస్ ఎంత కసిగా ఉందో.. ఈసారి తప్పకుండా అధికారంలోకి వచ్చి తీరాలె అనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఎవరికి వారే తమ తమ పార్టీని బలోపేతం చేసుకుంటూ జనాల మధ్య మేమే ప్రధాన ప్రతిపక్షమంటే మేమే.. అనే విధంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ అసంతృప్తి వాదులపై ఈ రెండు పార్టీలు కన్నేశాయనే సమాచారం అందింది అధిష్టానానికి.
అప్పుడు కేసీఆర్ పాలనలో ..తీవ్ర అసంతృప్తి ఉండే… చాలా మందిని మార్చాలని కూడా చూశారు. కానీ అప్పటికే కాంగ్రెస్ అక్కడ కాచుకు కూర్చున్నది. దీంతో మళ్లీ మళ్లీ సిట్టింగులకే ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చింది. అయినా కాంగ్రెస్ వైపు వెళ్లారు చాలా మంది బీఆరెస్ లీడర్లు. ఇప్పుడు కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి ఉందని బీజేపీ, బీఆరెస్ నేతలు పసిగట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోలోమని పది మంది రేవంత్ సమక్షంలో పార్టీ మారారు బీఆరెస్ ఎమ్మెల్యేలు. ఏమో అనుకున్నారు. కానీ అక్కడ ఏమీ లేదు. నిధులు లేవూ.. అభివృద్దీ లేదు. రెంటికీ చెడ్డ రేవడిలా మారింది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి.
దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలే కాదు.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వంపై చాలా అసంతృప్తితో ఉన్నట్టుగా అధిష్టానం వద్ద సమచారం ఉంది. అంతే కాదు.. ఎన్నికలకు సరిగ్గా ఒక ఏడాదికి ముందు ఏది బలంగా ఉంటే.. దాంట్లోకి జంప్ కావడం.. ఎమ్మెల్యే సీటును ముందే బుక్ చేసుకోవడం … చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ అసంతృప్తులకు గాలం వేసేందుకు ఇప్పట్నుంచే వేట మొదలు పెట్టాయి ఈ రెండు పార్టీలు.
మేమే వస్తాం.. అధికారంలోకి అంటే మేమే వస్తామని ప్రజల్లో బాగా బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా ఈసారి తెలంగాణనలో బీజేపీని అధికారంలోకి తెచ్చి తీరుతాడని ఇక్కడి కమలనాథుల్లో బలమైన నమ్మకం ఏర్పడింది. ఇటు బీఆరెస్లో .. కేసీఆర్ను ఓడగొట్టుకుని చాలా పెద్ద తప్పు పని చేశామని, మళ్లీ కేసీఆర్నే సీఎంగా గెలిపించుకోవాలనే తపనతో జనాలు ఉన్నారనే ప్రచారాన్ని విస్తృతంగా చేసుకోవడంలో సక్సెసయ్యిందనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మూడు ముప్పులు పొంచి ఉన్నాయి. ఒకవైపు బీఆరెస్, మరోవైపు బీజేపీ అధికారం కోసం పక్కలో బళ్లేలా వలె రోజు రోజుకు బలపడుతూ వస్తుండగా.. ఇప్పటికే అసంతృప్తితో ఉన్న నేతలను ఆపుకోవడం కూడా కష్టంగానే మారింది కాంగ్రెస్ పార్టీకి. మేమే గెలుస్తామని పదే పదే బహిరంగ వేదికల మీద ప్రదర్శించేంది ఒట్టి మేకపోతు గాంభీర్యమేనని అధిష్టానం కూడా పసిగట్టింది. అందుకే ఇక నష్ట నివారణ కోసం సీరియస్గా స్టేట్ పై దృష్టి సారించింది.