జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని ఏపీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మొన్నటిదాకా వివిధ అంశాలతో అట్టుడికిన ఏపీ.. ఇప్పుడు రా ఎన్టీఆర్! అనే పిలుపుతో మార్మోగిపోతున్నది. ఈనెల 18న రా ఎన్టీఆర్ పేరుతో ఏర్పడిన ఓ స్వచ్చంధ సంస్థ ప్రెస్మీట్ను నిర్వహించబోవడమే ఈ వైరల్ ప్రచారానికి ప్రధాన కారణం.
2023 జూలై 20న ఈ స్వచ్చంధ సంస్థను స్థాపించారు. అప్పట్నుంచి వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కానీ అంతగా హైలెట్ కాలేదు. అసలు ఈ పేరులోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్ష.. వస్తున్నాడనే సంకేతం ఇచ్చినట్టుగా ఉంది. దీంతో పాటు ఇది ఏర్పాటు చేసి మూడేండ్లు అయిన సందర్భంగా ఓ వంద కోట్లతో వివిధ స్వచ్చంధ, సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఊరువాడ అని పేరుపెట్టుకున్నారు.
దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకే ఈనెల 18న తిరుపతిలో ప్రెస్మీట్ పెట్టేందుకు రా ఎన్టీఆర్ అనే సంస్థ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దీన్ని పెట్టారని తెలుసు. కానీ ఆ పేర్లేమీ బయటపెట్టలేదు ఇప్పటి వరకు. ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఇవన్నీ సేవా కార్యక్రమాలు సాధ్యం కావు. ఇప్పుడు దీన్ని మరింత హైలెట్ చేసేందుకు 100 కోట్లు వెచ్చించి మరీ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టాలని సన్నాహాలు చేయడమే కొత్త అనుమానానికి తావిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ రాజీయాల్లోకి వస్తాడనే ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నది. అయితే ఎన్టీఆర్ వర్గాలు దీన్ని ఇప్పటికే కొట్టి పారేశాయి. కానీ ఇటీవల నందమూరి వంశంలో మారుతూ వస్తున్న పరిణామాలు, బాలయ్యబాబుకు, జూనియర్ ఎన్టీఆర్కు మధ్య చెడిన సఖ్యత దృష్ట్యా .. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీపై కోపంతోనే ఉన్నట్టుగా భావిస్తున్నారంతా. ఆయన మాట తీరు కూడా చాలా వేదికల్లో నర్మగర్బంగా తన కోపాన్ని ప్రదర్శించినట్టుగానే సాగుతోంది.
బాలయ్యతో కూడా అంటీముట్టనట్టుగానే ఉంటున్నాడు. మీ పార్టీ వారసుడు ఎవరు..? అంటే లోకేశ్ పేరే చెబుతున్నాడు.. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ పేరును పొరపాటున కూడా ఎక్కడా రాకుండా జాగ్రత్తపడుతున్నాడు బాలయ్య. దీంతో తాతయ్య పెట్టిన పార్టీగా ఓనాడు తనకు ప్రమాదం జరిగినా ఎన్నికల చివరి రోజుల్లో కూడా బెడ్ మీద పడుకుని మరీ బాబుకోసంప్రచారం చేసిన జూనియర్.. ఇప్పుడు అదే బాబును ఓడించి.. తనదైన కొత్త టీడీపీకి శ్రీకారం చుడతాడా? అనే అనుమానాలూ లేకపోలేదు.
ఎందుకంటే .. జూనియర్ ఎన్టీఆర్ను.. వీడు నా అంశ.. వీడికి నా పేరే పెట్టండి.. అని ఎన్టీయారే స్వయంగా చెప్పాడని, జూనియర్ తండ్రి హరిక్రిష్ణ పలు వేదికల్లో బాహాటంగానే చెప్పాడు. ఇప్పుడు టీడీపి రాజకీయ వారసత్వం.. చంద్రబాబు నుంచి అతని కొడుకు లోకేశ్కు హస్తగతం అవుతున్న సందర్భంలో.. అది తమ పార్టీ కాదని, తాత ఏర్పాటు చేసిన పార్టీ పూర్తిగా చిన్నాభిన్నమైందనే అభిప్రాయంతో జూనియర్ ఉన్నాడు. కానీ అతను కొత్త పార్టీ పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేయడం అంత ఈజీ కూడా కాదు.
తన శక్తియుక్తులన్నీ ఒడ్డి,అడ్డేసి ఆపేందుకు బాలయ్య ప్రయత్నాలు చేస్తాడు. మరి ఈ బంధాల గోడలను కూల్చి.. తనదైన రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించాలని జూనియర్ గట్టిగా తలిస్తే.. మాత్రం బాలయ్యచెప్పినా.. బాబు చెప్పినా.. అతను వినే రకం కూడా కాదు. జూనియర్ మార్కు రాజకీయ వేడి ఏపీలో ఇప్పట్నుంచే రగులుతున్నది. ఇది ఎలాంటి మంటలు సృష్టిస్తుందో మరి.