చెల్లె కవిత వేసిన పంచులకు, చేసిన ఆరోపణలకు కేటీఆర్ మతి తప్పినంత పనైంది. అందుకే గతి తప్పిన సమాధానామిచ్చాడు. బీఆరెస్ ఖాతాలో 1400 కోట్ల అవినీతి సొమ్ము ఉంది కదా.. వీటిని అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు పంచొచ్చు కదా..? అని కవిత బాంబు పేల్చిన విషయం తెలిసిందే. ఆ 1400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో.. కూడా ఆమె వెల్లడించడమే పెద్ద చర్చై కూర్చుంది.
ఇది ఉద్యమకారుల సెక్షన్లలో బాగా డిస్కషన్కు వచ్చింది. తాము అన్ని రకాల త్యాగాలకు పాల్పడితే.. సుఖం వారికి, దుఃఖం మాకా..? అనే చర్చ… బీఆరెస్ పై తీవ్ర ఆగ్రహన్ని తెచ్చిపెట్టంది. అయితే కవిత లేవనెత్తిన పార్టీ ఫండ్ అంశం గురించి ఏ ఒక్క లీడర్ కూడా మాట్లాడలేదు. మీడియానే కేటీఆర్ను ప్రశ్నించింది. కవిత ఆరోపణలకు మీరేం సమాధానం ఇస్తారని.
దీనికి మకతిక, తికమక సమాధానమొకటి ఇచ్చాడు కేటీఆర్. బహుశా దీనిపై విలేకరులు ఎవరూ తనని ప్రశ్నించరని అనుకున్నాడో, లేక ముందుగా ప్రిపేర్ కాలేదో తెలియదు కానీ.. ఈ ప్రశ్న నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్లకు ఆమె వేసి ఉంటుంది..అని తప్పించుకో జూశాడు. కాంగ్రెస్ ఖాతాలో 3వేల కోట్లున్నాయి మరి అని కూడా బయటపెట్టాడు. అంటే.. మా దగ్గర 1400 ఉంటే.. వారి వద్ద మాకంటే డబుల్ ఉన్నాయి.. మరి వాటి గురించి అడగరా..? అని ఉల్టా నిలదీసినట్టే ఉంది ఆయన వైఖరి.
అంతే కాకుండా.. ఇక ఇదే ఫ్లోలో.. అసలు ఉద్యమకారుల ఉసురు తీసింది కాంగ్రెస్సే… వారు ఆ కుటుంబాలకు ఎంత చేసినా తక్కువే అని కూడా ముక్తాయించాడు. అంటే ఇప్పటిదాకా మేం చేసింది అదే మస్తు… ఇకపై ఏం చేయబోమని చేతులెత్తేయడమే కాదు.. ఏమన్నా చేస్తే కాంగ్రెస్ సర్కారే చేయాలి….! వారినే అడగండి.. ఇకపై మేము అధికారంలోకి వచ్చినా ఈ విషయంలో మమ్మల్నెవరూ నిలదీయొద్దు సుమా? అని హెచ్చరించినట్టు, సూచన చేసినట్టు.. హితబోధ చేసినట్టుగా మాట్లాడాడు.
అంతే కాదు.. కవిత మమ్మల్ని ప్రశ్నించింది అంటే.. ఆమె కాంగ్రెస్ మనిషే అని పరోక్షంగా చెప్పడం కూడా కేటీఆర్ ఉద్దేశం అయి ఉంటుంది. అసలైన దోషులు వారే కదా.. మా దగ్గర కోట్ల సొమ్ము ఉంది కరెక్టే.. మమల్ని దొంగలుగా బయటపెట్టినప్పుడు.. మేము నీ కాంగ్రెస్ను వదులుతామా? అని అన్నట్టుగానే సాగింది కేటీఆర్ మాటతీరు. ఎందుకంటే కవితను ఏమీ అనలేక, నేరుగా ఎదుర్కోలేక, ఆమె వెనుక ఉండి కాంగ్రెస్ ఈ మాటలు అనిపిస్తుందనదే కేటీఆర్ భావన.
అందుకే కవిత తనపై కొట్టిన దెబ్బకు.. ప్రతీకారంగా కాంగ్రెస్ ఖాతాలో 3వేల కోట్ల విషయం బయటపెట్ట జబ్బలు చరుచుకున్నట్టే చేశారు.అంటే ఓ రకంగా తమ వద్ద ఆ డబ్బులు మూలుగుతున్నాయని, అవి ఎక్కడ్నుంచి వచ్చాయో కవిత చెప్పింది కూడా నిజమే కానీ.. వీటిని మాత్రం మేమేమీ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు పంచం.. ఇవ్వం.. !అని ఒప్పుకొని, ఖరాకండిగా చెప్పేసుకుని, అంగీకరించి.. చిన్నబుచ్చుకుని, సాకులు వెతుక్కొని, కాంగ్రెస్ గుట్టును బయటకు లాగి.. మేమేనా.. ఇగో వీరు కూడా అని చెప్పుకుని.. ఓ చిరునవ్వు నవ్వి.. మకతిక .. తికమక ఆన్సరిచ్చి ముగించేశాడు కేటీఆర్.