ఉద్యమకారుల ఇష్యూ మళ్లీ రాజేసుకుంటున్నాయి రెండు పార్టీలు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి ఆజ్యం పోశాడు. కాళేశ్వరం మీద మాట్లాడమంటే… మధ్యలో ఈ టాపిక్ను కూడా తీసుకొచ్చాడు. అన్ని విధాలుగా కేసీఆర్ను చక్రబంధంలో బంధించాలనేది రేవంత్ ఉద్దేశం. అందుకే ఆనాటి నుంచి ఉద్యమంలో కేసీఆర్తో పాల్గొన్నవాళ్లు ఒక్కరైనా ఇప్పుడు ఆయనతో ఉన్నారా? అని అడిగాడు రేవంత్. ఎందుకంటే ఆయన ఎవరి మాట వినడు.. ఉద్యమకారులను అసలే పట్టించుకోడు. ఎవరైనా ఆయనకు ఏదైనా సలహా ఇద్దామని పోతే… వారిని దూరం పెట్టేస్తాడు…అని కేసీఆర్ మనస్తత్వాన్ని గుర్తు చేశాడు. లేదా ఇంటి తలుపులు బద్దలు కొట్టించి అరెస్టులు చేయిస్తాడు.. అని కోదండరామ్ను ఉద్దేశించి ఈ మాటలన్నాడు రేవంత్.
దీనిపై హరీశ్రావు కూడా కౌంటర్ ఇచ్చాడు. మేము ఉద్యమకారులను పట్టించుకోకపోతే.. వీరికి పదువులెట్లా వచ్చినయని.. ఓ ఏడెనిమిది మంది పేర్లను వరుసగా చదివాడు. అయితే దీనిపై ఉద్యమకారుల్లో కూడా చర్చ మొదలైంది.వాస్తవానికి కేసీఆర్ పదవులు ఇచ్చింది కొందరికే. వేళ్లమీద లెక్కపెట్టేంతగా. అంటే అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. ఎంత మందికి ఆయన మర్యాదిచ్చిండు? ఎంత మంది ఉద్యమకారులకు కనీసం పార్టీ పదవులిచ్చిండు? తెచ్చుకున్న తెలంగాణలో.. పదేళ్ల బీఆరెస్ పాలనలో ఎమ్మెల్యేలు ఇచ్చిన గౌరవమెంత? పట్టించుకున్నదెవరు? ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కేసీఆర్కు బాగా ఉబ్బిచ్చుడు తెలుసు. ఉద్యమ సమయంలో.. నవ్వుతూ.. వారిని ఎంకరేజ్చేసినట్టుగా.. నేను నీకున్నా అన్నట్టుగా మాట్లాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కేసీఆర్ భాషలో చెప్పాలంటే.. తియ్యటి మాటలకు తీర్థం పోతే.. మళ్లొచ్చే సరికి ఇళ్లాగమయ్యిందట! సేమ్.. అట్లనే చాలా మంది ఉద్యమకారులను ఆగం చేశాడని తిట్టుకుంటారిప్పటికీ కేసీఆర్ను.
చాలా మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఉద్యమంలో తమ ఆస్తులు కరిగించుకుని కేసీఆర్ వెంట తిరిగారు. తమ త్యాగానికి తగిన ఫలితం లభిస్తుందని వారిలో ఆశలు ఉండే. అలా వారిని ఆశల పల్లకీలో ఊరేగించాడు కూడా కేసీఆర్. ఆ తరువాత రాష్ట్రం రాగానే .. అధికారం చేబూనగానే.. ఆయన అన్నమాటలు.. ఇకపై మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు.. మేమూ రాజకీయాలు చేస్తాం.. మరి పదికాలాలు ఉండాలంటే రాజకీయాలు చేయాలె కదా? అని తనకు తాను సమర్థించుకుని.. అలా అధికారం రాగానే అందరినీ కాలదన్నాడు.
తాను చెప్పినట్టు విన్నకొద్దిమందికి, బానిసలుగా పడి ఉండే కొంతమందిని మాత్రం దరి చేర్చుకున్నాడని తిట్టిపోస్తున్నారు ఉద్యమకారులు. ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్వి దొర పోకడలే. ఆయన లేచి.. రెడీ అయ్యి బయటకు వచ్చేది ఎప్పుడో తెలుసా? మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత. అప్పటి వరకు ఆయన రాక కోసం ఎదురు చూసుకుంటూ కూర్చునేవాళ్లు. కానీ అప్పుడు ఉద్యమానికి అతడు అవసరం. అప్పటి పరిస్థితులు అలాంటివి.
చాలా సార్లు జయశంకర్ సార్ కూడా అన్నాడు.. కేసీఆర్కు సవాలక్ష అవలక్షణాలుండొచ్చు.. కానీ తెలంగాణ తెచ్చుకోవాలంటే.. ఇలాంటి వాడిని ముందుంచాలె.. మూర్ఖంగా, మొండిగా పోరాడే వాడు ఎవరో ఒకరు కావాలె.. అది కేసీఆర్ను అనుకుందాం..! అని చాలా మందికి ఆయన నచ్చజెప్పినట్టు మాట్లాడేవాడు.
దీంతో ఉద్యమకారులు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా.. తెలంగాణ మీద ప్రేమతో.. కేసీఆర్ వెంట నడిచారు. కుటుంబాలు ఆగం చేసుకుని. ఆ తరువాత కూడా ఆగమే అయ్యారు కేసీఆర్ను నమ్ముకుని.