ఈ సర్వేల ట్రెండ్ ఇప్పటిది కాదు. కేసీఆర్ దీన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. రాజుల కాలంలో తన రాజ్యం ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలంతో వేగులను పంపి విషయం రాబట్టినట్టుగా.. కేసీఆర్కు కూడా ఈ పిచ్చి ఉండేది. ఆయన ప్రతీ మూడు నెలలకోసారి కూడా సర్వే చేయించుకునేవాడు.
ఎప్పటికప్పుడు జనం నాడి తెలుసుకోవడం ఆయనకు అలవాటు. ఎందుకంటే తన చుట్టూ ఉన్న మందీమార్బలం తనను పొగడ్తలతో ముంచెత్తేవాళ్లే తప్ప.. వాస్తవాలు చెప్పే ధైర్యం లేదు వారికి. ఇప్పుడు ఈ ట్రెండ్ను కేటీఆర్ ఫాలో అవుతున్నాడు. తాజాగా రేవంత్ కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు. కేటీఆర్కే అంత కుతూహలం ఉండగా లేనిది, మరి సీఎం కదా.. ! ఎవరేమనుకుంటున్నారో తెలుసుకోవడం అవసరమే కదా! చేపించుకుని ఉంటాడు.
ఈ సర్వేల గురించి బయటపెట్టి, వెల్లడించి.. అల్లరల్లరి చేసింది మాత్రం కేటీయారే. ఆయన చేపిచ్చుకున్నాడు.. నేనూ చేపించుకున్నాను.. ఇద్దరి సర్వేలు చూస్తే.. ఆయన ఢాం అంటున్నాడు.. మనం ధూంధాం అంటున్నామని చెప్పుకొచ్చాడు. అంటే.. ఈ సర్వేల లెక్కల ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనట.. బీఆరెస్ 78 సీట్లు గెలుచుకుంటుందట. కాబట్టి మనదే రాజ్యం.. మనదే అధికారం! యాహూ.. యురేఖా…! అని హైదరాబాద్ నేతలతో జరిగే మీటింగులో ఈ విషయం చెప్పి ఎగిరి గంతేసినంత పనిచేశాడట.
అంతేగా మరి బూస్టింగ్ నింపుకోవాలె. నిరుత్సాహం వీడాలె. ఉత్సాహం తెచ్చుకోవాలె. అల్పసంతోషులుగానైనా ఉండాలె తప్ప.. ఓపిక పట్టాలె. ఇదీ ఒకందుకు మంచిదే. ఉత్సాహంగా పనిచేయడానికి పనికి వస్తుందని అనుకున్నారట అక్కడున్న బీఆరెస్ నేతలు. అయితే ఇది కాస్తా బయటకు పొక్కింది. కేటీఆర్ ఇట్లా అన్నాడంటా.. ఇక కేసీఆర్ సీఎం కాబోతున్నాడంట.. రాబోయేది బీఆరెస్ సర్కారేనట..! అని.
ఇక ఊరుకుంటారా కాంగ్రెస్ శ్రేణులు. వారికీ ఈ మధ్య భయం పట్టుకున్నది. టర్ము దగ్గర పడుతున్నది. మళ్లీ వస్తామా రామా? పదవులు ఇచ్చినా ఇయ్యకున్నా పర్వాలేదు కానీ, ఉన్న అధికారం ఊడితే.. ఈ ముఖం తెలివి కూడా ఉండదని తేరుకున్నారట. అందుకే కౌంటర్లు బాగానే ఇస్తున్నారట. మాటకు మాట .. దెబ్బకు దెబ్బగా.. ప్రతిస్పందిస్తున్నారట.
ఈ కేటీఆర్ కామెంట్లపై కాంగ్రెస్ ఓ చురక, ఓ వ్యంగ్యం.. కలగలిపి ఓ కామెంట్ చేసింది. ముందు మీ హరీశ్ ఉంటుండా వ్యా… అది చూసుకో. ఆయన మీ దగ్గర ఉంటడని అనుకుంటున్నవా? బీజేపీలోకి జంప్ అయితడు. ఏదో అట్ల ఉగ్గవట్టి టైం కోసం చూస్తుండు. మీరు రారని తెలుసు.అందుకే జంప్ జిలానీ అయ్యేందుకు మోఖా కోసం చూస్తుండు…. !అని కేటీఆర్లో మళ్లీ అనుమానం రేకెత్తించేలా ఓ బాంబు వేశారట.
ఆ సర్వే ఫలితాల ఆనందమేమో గానీ, పక్కలో బల్లెం హరీశ్ను నమ్మొచ్చా..! పోతే గీతే ఎంత మందిని లావట్టుకుపోతడు? అనే కొత్త ప్రశ్నలు, అనుమానాలతో సతమతమవుతున్నాడంట. పక్కకున్న ఓ లీడర్ ఓ సలహా ఇచ్చిండంట కేటీఆర్కు. అసలు హరీశు ఉంటడా? పోతడా? అని కూడా ఓ సర్వే చేపిస్తే అయిపోతదిగా అన్నా! అని.
కేటీఆర్ ముఖంలో ఓ వెలుగు. కళ్లు పెద్దవి చేసి.. సలహా ఇచ్చినోడిని శభ్బాష్రా తమ్మీ! అన్నట్టుగా ఓ లుక్కిచ్చిండంట! ఇగ మళ్లా సర్వే షురూ……