అనుకున్నదే అయ్యింది. హైడ్రాకు మంచి పేరు తెచ్చేందుకు సర్కార్ ఎంత బూస్టింగ్ ఇచ్చినా.. ఎన్ని జాకీలు పెట్టి లేపుదామని ట్రై చేస్తున్నా.. ఇదిగో ఇలాంటి ఘటనలు చాలు దాని పరువు బజారున పెట్టేందుకు. ఆ హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకే వెళ్తున్నాయి కానీ.. పెద్దల జోలికి పోవడం లేదని, తమ అనుయాయుల ఆస్తులను మాత్రం కాపాడుతున్నాయనే ప్రచారం నిజమేనని చెప్పడానికి తాజాగా ఓవైసీ ఫాతిమా కాలేజీ ఉదంతం నిలుస్తోంది.
ఈ ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. హైడ్రా చేపట్టినప్పుడే మనం చర్చించుకున్నాం. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కొట్టేసినప్పుడే చెప్పుకున్నాం.. ఏమని? ఇది పులి మీద స్వారీలాంటిదని. పులి మీద హైడ్రా స్వారీ చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది. అది ఆగిందో.. పులి మీద నుంచి దిగిందో.. ఆ పులికే అది బలవుతుంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది.
సీఎం రేవంత్ తన బహిరంగ సభల్లోనే ఎన్నోసార్లు చెప్పాడు. అక్రమంగా ఫామ్హౌజులు నిర్మించుకున్నారని. కానీ వాటి జోలికి పోలేదింత వరకు. సరే, ఆ సంగతులు వదిలేద్దాం. తాజాగా ఇప్పుడు ఓవైసీకి చెందిన బండ్లగూడలోని సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఫాతిమా ఓవైసీ కాలేజీ విషయంలో హైకోర్టు సర్కార్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
దీనికి అనుమతులు లేవని గతంలో సమాధానమివ్వడం.. మరెందుకు ఆ కాలేజీని నిర్వహిస్తున్నారని కోర్టు తిరిగి ప్రశ్నించడం.. దీనికి కూడా ఏదో కారణం చెప్పి సర్కార్ తప్పించుకున్నట్టే చేసింది. కానీ జీహెచ్ఎంసీని కూడా వదల్లేదు సర్కార్. అసలు ఈ బిల్డింగుకు అనుమతులు ఎలా ఇచ్చారు..? అని అడిగితే ఇప్పటి వరకు సర్కార్ దీనికి ఆన్సర్ ఇవ్వలేదు.
అంటే ఇది పాలకులు ఎవరున్నా గానీ, ఎవరూ పట్టించుకోలేదని అర్థమైపోయింది. కానీ ఇప్పుడే మళ్లీ ఎందుకు దీన్ని బయటకు తెచ్చారు? అంటే.. ఓ వ్యక్తి దీనిపై కేసు వేశాడు. కారణం హైడ్రానే. మరి సర్కార్.. ఎడాపెడా అన్నీ కూలగొడుతుంటే.. దీన్ని ఎందుకు వదిలినట్టు…? అడగడం సహజమే. ఆ ప్రశ్నలోనూ న్యాయముంది? మరి సర్కార్ మేం.. పారదర్శకంగా ఉన్నామని చెప్పాలంటే.. నిరూపించుకోవాలంటే.. దీన్ని కొట్టాలె కదా? అలా చేయలేదు.
అంత ధైర్యం ఉందా? అని ఎన్నోసార్లు ఎంతోమంది నిలదీసినా.. సర్కార్ పట్టించుకోలేదు. దీనిపై ఇప్పుడు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో మళ్లీ సర్కార్ మెడకు పడ్డదీ ఇష్యూ. త్వరలో దీనిపై సమాధానం చెప్పాల్సి ఉంది.. అనుమతులు లేవు.. అంటే మరి కూల్చండి.. అంటుంది. ఉన్నాయి అంటే.. ఎలా ఇచ్చారు? అని ప్రశ్నిస్తుంది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది రేవంత్ సర్కార్ పరిస్థితి.
తాజాగా దీనిపై కవిత కూడా స్పందించారు. రేవంత్కు కళ్లు కనిపించడం లేనట్టుంది. కళ్ల డాక్టర్కు చూపియ్యాలె. ప్రపంచమంతా ఈ ఓవైసీ కాలేజీ అక్రమంగా నిర్మించారని చెబుతుంటే.. వీరు మాత్రం హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో బీఆరెస్ పార్టీ కూడా హైడ్రాను తీవ్రంగా వ్యతికిస్తూ వచ్చింది. పేదల ఇండ్లనే టార్గెట్ చేస్తున్నారని, పెద్దలను వదిలేస్తున్నారని అన్నారు.
కానీ కేటీఆర్ ఏనాడూ ఓవైసీ కాలేజీ ప్రస్తావన తీయలేదు. కారణం అది రాజకీయరంగు పులుముకుని ఉంది. అప్పుడు బీఆరెస్ అయినా.. ఇప్పుడు కాంగ్రెస్ అయినా.. పాలకులు ఎవరున్నా.. వారికి ఎంఐఎం సపోర్టు కావాలి. అదే ఆ ఓవైసీల ధీమా. అందుకే దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. కానీ బద్నాం మాత్రం ఇప్పుడు రేవంత్ సర్కార్ ఖాతాలో పడతున్నది.
కవిత కూడా రేవంత్ సర్కార్ను ఇరుకున పెట్టే విధంగా తీసుకున్న పొలిటికల్ స్టాండ్లో భాగంగానే ఇవాళ దీనిపై ఆమె ట్వీట్ చేసి .. రేవంత్కు కళ్లు కనబడటం లేదని విమర్శించారు.