ఎల్నినో తో కరువు ఛాయలు అలుముకోనున్నాయనే కారణంతో .. ఇదే అదనుగా కాళేశ్వరం ఇష్యూను రాజకీయం చేయడంలో దూకుడును ప్రదర్శిస్తోంది బీఆరెస్. కన్నెపల్లి పంప్హౌజ్ వద్దకు వెళ్లడం కూడా ఈ వ్యూహంలో భాగమనే చెప్పాలి. ఆ రాజకీయ డ్రామలో బీఆరెస్కే మైలేజీ వచ్చిందని చెప్పాలి. దీని తరువాత సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టడం.. అసలు నీటి లభ్యతే లేని చోట ఎలా కన్నెపల్లి పంప్హౌజ్ను నింపాలని నిలదీయడం.. కన్నెపల్లి పంప్హౌజ్ కూడా వరద నీటిలో మునిగిపోయిన విషయాన్ని వెల్లడించడం.. మొత్తానికి ఈ సీజన్కు కాళేశ్వరం నీటిని అందించలేమనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం నేరుగా చెప్పేసింది.
దీని తరువాత మళ్లీ హరీశ్ రావు కూడా ఓ ప్రెస్మీట్ పెట్టాడు. గంటపాటు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. కన్నెపల్లి వద్ద ఇప్పుడు కొనసాగుతున్న గోదావరి వరదతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని సర్కార్కు సూచన చేశాడు. తనను ఓ మూడు నెలలు మంత్రిగా చేస్తే చేసి చూపిస్తా అని అనడం బూమరాంగ్ అయ్యింది. కొండంత రాగం తీసి.. అన్నట్టుగా అంత సేపు నీటి లభ్యత గురించి మాట్లాడిన హరీశ్.. తనను మంత్రిని చేస్తే.. అనే దగ్గరే ప్రత్యర్థి పార్టీలకు దొరికిపోయాడు.
అప్పుడు నువ్వు చేసిన ఘనకార్యమేనని ఒకరు, ఇంకా పదవి కావాలా? తిన్నది సరిపోదా అని మరొకరు, అధికార దాహం తీరలేదా అని మరికొందరు? అసలు నిన్ను కేసీఆర్ నమ్మకనే కదా అప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదు.. అని గతం కూడా తవ్వారు ఈ సందర్బంగా.
అంతే కాదు.. నిన్ను నమ్ముకునే ఇంకా ఆ పార్టీ ముందుకు పోతున్నదంటే ఆ పార్టీని దేవుడు కూడా రక్షించలేడనే అభిప్రాయాలూ వెల్లడయ్యాయి. హరీశ్రావు.. ఇంకా కమీషన్లు ఏవైనా బాకీ ఉన్నాయా? మూడు నెలలు మంత్రివి అయితే.. ఆ కమీషన్లు తీసుకుందామని పదవి అడుగుతున్నావా? అని మంత్రి పొంగులేటి.. ఇలా తలో ఒక మాట అంటూనే ఉన్నారు.
మరి నీకు మంత్రి పదవి ఇవ్వాలంటే.. నువ్వు కాంగ్రెస్లోకి రావాలి కదా? అనే లాజిక్ పాయింట్ను కూడా లాగి వదిలాడు జగ్గారెడ్డి. అవును… ఇది కూడా కరెక్టే కదా హరీశ్..! అని మరో మంత్రి పల్లవి అందుకున్నాడు. అసలు విషయం కాస్తా పక్కకు పోయింది. ఈ మూడు నెలల మంత్రి పదవి అంశం ముందుకు వచ్చింది. ఇది ఎక్కడి వరకు పోయిందంటే.. వారం రోజుల పాటు కేసీఆర్ను సీఎం చేయాలని కేటీఆర్ అంతకు ముందు ప్రతిపాదన పెట్టాడు. ఇప్పుడు హరీశ్ తనను మూడు నెలల పాటు ఇరిగేషన్ మంత్రిని చేయమన్నాడు. ఈ రెండు ప్రతిపాదనలను తీసుకుని.. కేసీఆర్ సీఎం కావడం హరీశ్కు ఇష్టం లేనట్టుంది…అందుకే తన పేరును తీసుకున్నాడు.. అని విమర్శించేదాకా పోయింది.
దీంతో కాళేశ్వరం, కన్నెపల్లి, మేడిగడ్డ, ఎల్నినో, కరువు.. నీటి విడుదల.. ఇవన్నీ పక్కకు పోయి.. మూడు నెలల మంత్రి పై మాత్రం మూకుమ్మడిగా మాటల దాడి కొనసాగుతూ వస్తోంది.