పశ్చిమ బెంగాల్ ఫలితాల నేపథ్యంలో అక్కడ మమత బెనర్జీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ఉదంతం తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నది. ఈవీఎంల గోల్మాల్ తదితర కారణాలతో ఆమె నివాసాన్ని ఖాళీ చేసి వాటిని భద్రపరిచిన ప్రాంతానికి మారిందని ఎంత చెప్పినా.. ఆమెను ఓటమి భయం వెంటాడిందనే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ రిజల్ట్ ఎలా ఉండబోతున్నాయో ఉత్కంఠైతే కొనసాగుతోంది. సేమ్ ఇలాగే ఇక్కడ తెలంగాణ 2023 ఎన్నికల ఫలితాలకు ముందే కేసీఆర్ తన ఓటమిని అంచనా వేశారు.
ప్రచార సమయంలోనే అది ఆయనకు కనిపించింది. కారణాలేమైనా.. ఎన్నైనా.. జనం అధికార మార్పు కోరుకుంటున్నారని ఆయన భావించారు. అప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టు..తన అనుభవంతో జనం నాడి తెలుసుకోగల నేతగా కేసీఆర్ తన ఓటమిని పసిగట్టారనే చెప్పాలె. అందుకే ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా జనాన్ని పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. ఆగం కాకండి.. అటూ ఇటైతే గోస పడతాం.. అన్నారు. ఇంకా ఇది చాలదని తన ప్రసంగంలో డోస్ను కూడా పెంచారు. నేను ఓడిపోతే నాకేం పోదు.. పోయి ఫామ్హౌజ్లో పంట.. మీకే నష్టం.. అనే దాకా ఆయన మెట్టు దిగారు. అయినా జనం వినలేదు.
అప్పటికే మెజారిటీ సెక్షన్.. ఓటు డైవర్టు చేసేందుకు సిద్దమయ్యారు. ఈ విషయం పసిగట్టారు కేసీఆర్. పించన్ ఏకంగా 4వేలు పెంచుతామని కాంగ్రెస్ .. అంటే తాను పెంచుతనన్నారు. కానీ ఒకేసారి కాకుండా… ఏడాదికి ఐదొందల చొప్పున.. నాలుగేండ్లలో నాలుగు వేలు చేస్తానన్నారు. రైతుబంధు కూడా కొంచెం కొంచెంగా పెంచుతానన్నారు. ఇలా కాంగ్రెస్ హామీలను తట్టుకునే ప్రయత్నమే చేశారు కానీ..మరీ దానితో సమానంగా హామీలిస్తే.. కాంగ్రెస్కు భయపడుతున్నారని భావిస్తారనుకున్నారు. అందుకే తన ప్రచారంలో సాధ్యం కాని హామీలిస్తున్నారు.. అని కూడా కాంగ్రెస్పై దాడి చేశారు కేసీఆర్. ఎన్ని చేసినా.. ఎంత మాట్లాడినా.. ప్రజలు అధికారం కాంగ్రెస్కు ఇవ్వాలనుకున్నారు. అందుకే రిజల్టు సమయంలో కూడా ఓ స్పష్టమైన క్లారిటీతోనే కేసీఆర్ ఉన్నారు.
ఫలితాలు ఇంకా పూర్తిగా రాకముందే…. ట్రెండ్స్ చూసుకున్నారు. అంతే.. ఇక తన ఓటమి తప్పదని డిసైడ్ అయ్యారు. తన అధికారిక నివాసం ప్రగతిభవన్ ను వదలి , తన కాన్వాయ్ అన్నీ వదిలేసి .. తన సొంతకారులో నేరుగా ఎవరికీ చెప్పకుండా ఆయన ఫామ్హౌజ్కు బయలుదేరి వెళ్లిపోయారు. ఆ తరువాత పూర్తి స్థాయి ఫలితాలు ప్రకటన.. బీఆరెస్ నేతల ప్రెస్మీట్.. అంతే. కేసీఆర్ మాట్లాడలేదు. జనం ఇచ్చిన తీర్పుకు ఆన్సరూ ఇవ్వలేదు. ఓటమిని గంభీరంగా అంగీకరించారు అనే మెసేజ్తో పాటు బాధ్యత లేకుండా, జనానికి జవాబుదారీగా ఉండకుండా వెళ్లిపోవడం పలాయనవాదం కిందకే వస్తుందనే విమర్శా కేసీఆర్ ఆనాడు ఎదుర్కొన్నారు.
కానీ ఇక్కడ మమత మాత్రం తగ్గేదే లేదంటున్నారు. అది మేకపోతు గాంభీర్యమా..? ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపమా? తెలియదు. ఫలితాలు ఆమెకు ప్రతికూలంగా వచ్చినా.. ఆమె దీన్ని గంభీరంగా ఓన్ చేసుకునే పరిస్థితి అక్కడ లేదు. కచ్చితంగా బీజేపీని విలన్ చేస్తుందామె. తన ఓటమికి కారణం తమ పాలన … మార్పు అని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. బీజేపీ అధికార దుర్వినియోమనే అస్త్రమే ప్రయోగిస్తారు. ఇక్కడ కేసీఆర్.. కూడా తన పదేళ్ల పాలన, లోపాలపై ఎప్పుడూ ఆత్మ పరిశీలన చేసుకోలేదు. ప్రజలు మోస పోయారు. హామీలకు ఆశపడ్డారు.. అంతే అనుకుంటున్నారు. అదే చెబుతున్నారు కూడా బహిరంగ వేదికల మీద. ఇదీ ఇద్దరి మధ్య ఉన్న సారూప్యత..వైరుధ్యం..!