బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? అనే గందరగోళానికి తెర వేసింది అధిష్టానం. ఆయనను కేంద్ర సహాయ మంత్రిగా కంటిన్యూ చేయాలనే డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైన నేపథ్యం.. తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమైన పరిస్థితులను అధిష్టానం సీరియస్గా తీసుకోలేదని తెలుస్తోంది.
కొడుకు చేసిన పొరపాటుగానే దీన్ని ఢిల్లీ పెద్దలు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బండిని పక్కకు పెడితే పార్టీకి మరింత డ్యామేజీ అవుతుందనే సమాచారం వారికి ఉంది. బీఆరెస్ దీన్ని తన రాజకీయ మైలేజీ కోసం విస్తృతంగా వాడుకున్నది. వ్యక్తిగతంగా కూడా బండి సంజయ్ను వెంటాడాడు కేటీఆర్. ఇది పార్టీ పరంగా కాకుండా.. ప్రతీకారేచ్చగా కూడా రచ్చకు తెరలేపింది.
ఇప్పుడు బండి సంజయ్ను .. కొడుకు కేసు కారణంగా పక్కకు పెడితే ఇది పార్టీకి నష్టమే కాదు.. బీఆరెస్కు బలాన్నిస్తుందని, అది వారు సాధించిన విజయంగా కూడా చెప్పుకుంటారనే ఆలోచన అధిష్టానానికి ఉంది. అందుకే బండిని టచ్ చేయకుండానే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణను పూర్తి చేయనున్నారు.
అయితే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ గంపెడాశలు పెట్టుకున్నాడు. బండి సంజయ్ను తొలగిస్తే.. అదే మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి తనకు అవకాశం దొరకుతుందని అంచనాలు వేసుకున్నాడు. కానీ అది కుదిరేలా లేదు. ఈసారి కూడా అర్వింద్కు చుక్కెదురు కానుంది. అయితే కేంద్ర మంత్రి పదవి ఇవ్వని పక్షంలో తనకు రాష్ట్ర పార్టీ పగ్గాలైనా ఇవ్వాలని కోరుతున్నాడు.
కానీ ఇప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడిని తీసేయడం కూడా చేయరు. అయితే బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేందుకు గాను.. కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తప్పించాల్సి వస్తుంది. అది కూడా ఓ ఆరు నెలల పాటు వేచి చూసే దోరణిని అవలంభించాలని అధిష్టానం మదిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బండి సంజయ్ అధ్యక్షుడిగా మరింత దూకుడుగా పోతాడనే భావన వారిలో ఉంది.
ఓ ఆరు నెలల తరువాత కేంద్ర మంత్రి పదవి నుంచి బండిని తప్పించి.. స్టేట్ పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నారు. దీంతో ఈ లెక్కన చూసినా.. అర్వింద్కు అటు కేంద్ర మంత్రి పదవిలో.. ఇటు రాష్ట్ర అధ్యక్ష పదవిలో చాన్స్ లేనట్టేనని అర్థమవుతోంది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ దూకుడుగా ముందుకు పోయింది. ఇదే ఒరవడిని ఎన్నికల దాకా తీసుకొస్తే.. స్టేట్లో బీజేపీ కనీసం 20 వరకు ఎమ్మెల్యేలను ఈజీగా గెలవగలిగేదే అనే అభిప్రాయాలున్నాయి.
అప్పుడు కేసీఆర్, మోడీ దోస్తానా కారణంగా.. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి చెప్పి మరీ తీయించాడనే ప్రచారం ఉంది. అప్పటి రాజకీయ సమీకరణలు వేరు. అప్పుడు మోడీకి కేసీఆర్ అవసరం. కేసీఆర్ చెప్పింది నడిచింది. చెప్పినట్టు వినకుండా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానన్నప్పుడే కేసీఆర్ దూకుడుకు బ్రేకులు వేసేందుకు కవితను లిక్కర్ స్కాంలో ఇరికించారు.
ఇప్పుడు కేసీఆర్తో పని లేదు. సింగిల్గానే కొట్లాడుదామని డిసైడ్ అయ్యింది బీజేపీ. ఒంటరిపోరు ద్వారా తమ బలమెంతో తేల్చుకుంటారు. అవసరమైతే ఫలితాలను బట్టి కేసీఆర్తో జత కడతారు.. ఇదే పాలసీ ప్రకారం ముందుకకు సాగుతోంది బీజేపీ. అందుకే పార్టీని ఉరుకులు పెట్టించేందుకు బండికి రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలనే ఆలోచన మాత్రం అలాగే పదిలంగా ఉంది. దీని కోసం కొంత సమయం తీసుకోనున్నారు.