Kakinada: కాకినాడ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఒక కలకలం రేగింది. కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామంలో రాత్రి టిఫిన్ తిన్న స్థానికులు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలవ్వడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది.
అసలేం జరిగిందంటే..?
దుగ్గుదుర్రు గ్రామం సెంటర్లో ఉన్న ఒక కాకా హోటల్ లో శనివారం రాత్రి చాలా మంది చల్ల బజ్జీలు తిన్నారు. ఆ బజ్జీలు తిన్న కొద్దిసేపటికే కొంతమందికి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారేసరికి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సుమారు 50 మంది వరకు ఈ ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో వెంటనే వారందరినీ స్థానిక దుగ్గుదుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించారు. ఈ ఘటనతో భయపడిపోయిన హోటల్ యజమాని, రాత్రికి రాత్రే షాపును మూసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Also Read: అమరావతికి వెళ్తే తప్పేంటి.. దోపిడీ బయటపడుతుందనే భయమా? కూటమిపై బొత్స సంచలనం!
రంగంలోకి దిగిన వైద్యారోగ్య శాఖ
విషయం తెలియగానే కాకినాడ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి (DM&HO) వెంటనే అలర్ట్ అయ్యారు. ఆయన అధికారులతో కలిసి నేరుగా దుగ్గుదుర్రు గ్రామానికి చేరుకున్నారు. పీహెచ్సీలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడ ఉన్న వైద్యాధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం
ప్రస్తుతం బాధితులందరికీ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు స్పష్టం చేశారు. గ్రామంలో మరికొంతమందికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా అని పరిశీలించేందుకు ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని రంగంలోకి దించారు. హోటల్లో వాడిన నూనె, ఇతర పదార్థాల నాణ్యత లోపించడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అధికారులు హోటల్ పై చర్యలకు సిద్ధమవుతున్నారు.