చాలా రోజుల తరువాత జరిగిన జగిత్యాల కేసీఆర్ సభలో ఆయన పాత పంచులు విని ఎంతో సంతోషపడ్డారు గులాబీ నేతలు. ఆయన అభిమానులు. వింటేజ్ కేసీఆర్..అంటూ ఆ వీడియోలు తెగ వైరల్ చేసుకున్నారు. ఆయన ఎవరినో తిట్టినవో.. ఆవేశంగా విమర్శించినవో కాదు.. మరి! సభికులనుద్దేశించి కసురుకున్న మాటలు. చికాకు పడుతూ తిట్టిన తిట్లు. అవును.. అవంటే వాళ్లకు ఇష్టం. కేసీఆర్ నోటి వెంట ఆ మాటలు వినాలనే సభల్లో డిస్టబ్ చేస్తూ ఉంటారు. ఊరికెనే అరుస్తూ ఉంటారు. కేసీఆర్ సీఎం సీఎం సీఎం..అంటూ నినాదాలిస్తూ ఉంటారు.
కేసీఆర్ ఓ అలవాటుంది. తాను మాట్లాడేటప్పుడు ఎవరూ మాట్లాడొద్దు. ఏదో బాలక్రిష్ట సినిమాలో డైలాగుంది. నేను చెప్పేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలె. కాదని ఇంకేది పనిచేసినా నీ నెక్ట్స్ బర్త్డే ఉండదు.. అని. ఇక్కడ అంత సీరియస్ కాదు. అంత సీన్ లేదు కానీ… ఆయన కసురుకుంటాడు. మాట వినకుండా డిస్టబ్ చేస్తే చిర్రెత్తుకొస్తుంది. ముఖం ఎర్రబారుతుంది. భృకుటి ముడిపడుతుంది. అన్యపదేశంగా స్పీచ్ ఆపేస్తాడు. కసురుకుంటాడు. సీఎం సీఎం సీఎం.. అనగానే.. ఏందీ.. అయితే మరి మనది మనమే చెప్పుకుని ఎళ్లిపోదామా ఈడ్నుంచి .. అంటాడు. సారు వెటకారం వాళ్లకు అర్థం కాదు. అర్థమైనా దాని కోసమే ఎదురుచూస్తున్నట్టు ఇంకా గట్టిగా కేరంతలు కొడతారు.
అరే ఏంది వయా ఆడ లొల్లి… జర సూడుర్రి.. ఆళ్లను ఆగవట్టుర్రి… అని స్టేజిమీదున్నోళ్లను గదమాయిస్తాడు. ఆడోడు ఆడోడు మోపైనాడు అంటాడు మరీ కోపం తెప్పిస్తే. ఆ గుంపులో ఉన్నది మనోడేనా.. అవతలకెళ్లి ఎవడైనా వచ్చిండా? అని చిన్నగా నవ్వుతాడు. ఇగ ఆ నవ్వు ఇంకింత కేరింతలు కొడుతరు పోరగాళ్లు. అరే ఊకోవయా.. నువ్వొర్రా.. నేనేర్రా.. ఎవనికర్థమయితది? అని తిడతాడు కూడా. చాలు తియ్ నీ ఒర్రుడు సళ్ల గుండ.. అని కసురుకుంటాడు ఒక్కొకప్పుడు. ఇంత సభ పెట్టుకుని.. నాలుగు ముచ్చట్లు చెబితే వచ్చినోళ్లు ఇనాలె గదా.. అని సముదాయిస్తడు మరోసారి. ఇలా మధ్య మధ్యలో అల్లరికి ఆయన స్పీచ్కు బ్రేకులు పడాల్సిందే. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటేనే తన స్పీచ్ కంటిన్యూగా సాగేది. లేదంటే కసురుకోవడం ఖాయం.
తిక్కరేగితే అరే చుప్ బేకూఫ్ గాళ్లుండ్రారా బై. సైలెంట్గా కూసోరాదా? అని తిట్ల దండకమూ చదువుతాడు
ఇక్కడ బహిరంగ సభల్లోనే కాదు.. అసెంబ్లీలో కూడా అంతే. అంతెందుకు… ఆయన ఎక్కడ ఏ మీటింగుకు పోతే అక్కడ అంతే. కేసీఆర్ చెప్పేటప్పుడు ఎవరూ మాట్లాడొద్దు. ఆయన చెప్పింది వినాలంతే. అందుకే అసెంబ్లీలో తనను ప్రశ్నించే వారే ఉండొద్దని, తను మాట్లాడేటప్పుడు తనకు అడ్డే తగలకుండా ఉండాలని ప్రతిపక్ష సభ్యులందరినీ తన పార్టీలో చేర్చేసుకున్నారని కొందరు విమర్శిస్తూ ఉంటారు కూడా. అది తన సహజ లక్షణంగా కంటిన్యూ అవుతూ వస్తూనే ఉంది. ఇంకా వయస్సు మీద పడ్డా కొద్ది అది ఎక్కువే అవుతుంది గానీ.. తక్కువైతే కావడం లేదంటారు ఆయనను దగ్గరగా చూసిన నేతలు.
ఇప్పుడాయన అసెంబ్లీకి రాకపోవడానికి కూడ అదే కారణంగా చెబుతారు చాలా మంది. అక్కడ అధికార పక్షం చేసే విమర్శలు, ఆరోపణలు వినుకుంటా వాటిని తట్టుకొని ఓపిగ్గా కూసోవడం ఆయనకు చేతకాదు. అదొక నరకం, శిక్షలా ఆయన భావిస్తాడట. ఆయనలోని ఆ గుణమే ఇప్పటి దాకా అసెంబ్లీలో హాజరుకాకుండా చేసిందట. అయితే ఈ లెక్కన ఈ టర్మంతా గైర్హాజరేనన్నమాట!