మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు పూర్తిగా లూటీ చేశారని విమర్శించారు. అధికారం కోల్పోయిన బాధలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ తామే వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజా తీర్పు స్పష్టంగా ఉందని వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదల సంక్షేమం కోసం చేపట్టిన పనులు ఏవని ప్రశ్నించారు. ముఖ్యంగా విద్య అలాగే వైద్య రంగాలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. పేద ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఆస్పత్రుల అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ప్రజలపై అప్పుల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక సంక్షోభం- కాంగ్రెస్ కసరత్తు
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి గత పాలకుల అవినీతే కారణమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా దోచుకోవడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గందరగోళం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని వివరించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఒక్కో హామీని అమలు చేస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు.
BRS నేతల తీరుపై MLA రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం
కేసీఆర్ రాష్ట్రాన్ని లూటీ చేశారు
అధికారంపై బీఆర్ఎస్వి పగటి కలలు
మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం
ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం
– రాజగోపాల్ రెడ్డి
MLA Rajagopal Reddy expressed… pic.twitter.com/ONm8bfHJV2
— BIG TV Breaking News (@bigtvtelugu) April 21, 2026
బీఆర్ఎస్ పేరు మార్పుపై సంచలన వ్యాఖ్యలు
పార్టీ పేరు మార్పు అంశంపై రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ రోజైతే టీఆర్ఎస్ అనే పేరును బీఆర్ఎస్గా మార్చారో అప్పుడే తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయిందని విమర్శించారు. ప్రాంతీయ సెంటిమెంట్ను వదిలేసి జాతీయ రాజకీయాల మోజులో పడి కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడో తిరస్కరించారని.. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు.
ALSO READ: మహేశ్కు మంత్రి చాన్స్ లేనట్టే! వైఎస్-డీఎస్ జోడీ హిస్టరీ… రేవంత్-మహేశ్తో రిపీట్ అవుతుందా?