రాజకీయ పార్టీలకు చాన్స్ దొరికితే చాలు.పోయిన అధికారాన్ని ఎలాగోలా తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నది.మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నది. అధికార కాంగ్రెస్ ఏ చిన్న తప్పు చేసి దొరికినా దానిని తమకు పాజిటివ్గా మార్చుకుని హస్తం పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. సాధారణంగా ప్రతిపక్ష నాయకుడు ఎల్లప్పుడూ అధికార పార్టీని కార్నర్ చేస్తుంటాడు.కానీ, రాష్ట్రంలో అంతా రివర్స్లో జరుగుతున్నది.ప్రతిపక్షం పాత్రను సైతం అధికార పక్షమే నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించేలా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై ప్రతిపక్ష నేత ఇంతవరకూ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
2011లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది.కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఓవైపు.. శ్రీకాంతచారి బలిదానంతో ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ కాంక్ష రగిలింది.సకలజనుల సమ్మెతో అది కాస్త పీక్స్కు చేరింది. ఆనాడు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ వచ్చాక వరుసగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అధికారంలో ఉన్నన్ని రోజులు గంభీరంగా ఉన్న కేసీఆర్.. గద్దె దిగాక ఒక్కసారికగా డల్ అయ్యారు.కేవలం ఫౌంహౌస్ వేదికగా ఉంటూ ప్రస్తుత ప్రభుత్వం తీరును గమనిస్తున్నారు. అంతేకానీ, ప్రతిపక్ష నాయకుడి హోదాకు తగినట్టు పనిచేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆయన బయటకు వచ్చి సర్కారును ప్రశ్నించాలంటే కొత్తగా సమస్య కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు.కేసీఆర్ బయటకు వస్తున్నారంటే చాలు.. ప్రజలే ఆయనకు ఎదురుగా వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటారు. విద్యార్థుల నుంచి రైతుల వరకు.. ఉద్యోగుల నుంచి మహిళల వరకు ఇలా ఎవరి సమస్యలు వారివే. ముఖ్యంగా ఖజానా ఖాళీ పేరిట నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సైతం ఆరోపిస్తున్నారు. రైతులు సైతం తమకు యూరియా, సాగు నీరు ఇబ్బందులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుది అంకానికి డీలిమిటేషన్.. రాత్రి 7 గంటలకు ఓటింగ్, బిల్లు గట్టెక్కుతుందా?
పై వాటన్నింటికీ తోడు ప్రస్తుతం మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల గురించి రాష్ట్రంలో జోరుగా చర్చ జరగుతున్నది.నేడు పార్లమెంటులో ఈ బిల్లులపై ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ చట్టరూపం పొందింది. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో మాత్రం లోక్సభలో ఓటింగ్ జరగనుంది. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. అయితే, డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరుగుతాయని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని ప్రధాని మోడీ ప్రకటించినా.. ఉత్తర భారతంతో సమానంగా దక్షిణంలోనూ పెంచాలని ప్రభుత్వాలు దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఫైట్ చేస్తున్నా.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం దీనిపై స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంచి అవకాశాన్ని కేసీఆర్ చేజార్చుకున్నారని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వంతో కలిసి ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.వారి ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి నిరసన తెలపాలని డిమాండ్ చేస్తున్నారు.