అర్వింద్ అంతే! ఎవరి మాట వినడు. ఆ మాటకొస్తే తన మాట తనే వినడు. ఒక్క మోడీ తప్ప ఎవరి జపం చేయడు. ఎవరినీ లెక్క చేయడు. కనీసం ఆ పార్టీ పెద్దలను కూడా. ఊరందరిదీ ఒకదారైతే.. అర్విందొక దారి.
మొన్ననే అనుకున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని తహతహలాడే పార్టీ నేతలు.. బొట్టు రాజకీయాలంటూ మరి దిగజారి పోయి ఉంటే.. ఎప్పుడు మీరు ఆ పొజిషన్కు పోయేది? ఎప్పుడు అధికారంలోకి వచ్చేది? అని. ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతూ వస్తున్నారు.. ఏనాడైనా వీరి గురించి రోడ్డెక్కారా. ఆందోళన చేశారా? మరి ఎలా జనాలు మిమ్మల్ని దరి చేర్చుకునేది.
ఈ మతాలు, బొట్లు, ఆటోలపై జై శ్రీరామ్ రాసుకుంటాం.. అనే నినాదాలతో మీరు అధికారంలోకి వస్తారా? అనేది బిగ్టీవీ వెబ్సైట్ నుంచి వచ్చిన వార్తా కథనం సారాంశం. కానీ నిన్న అర్వింద్.. నిజామాబాద్లో చేపట్టిన ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆందోళన.. సూపర్ సక్సెసయ్యింది. ఇది రాష్ట్ర కమిటీ పిలుపు కాదు. కానీ అర్విందే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని పెట్టిన ధర్నా.
ఇలాంటివే కదా బీజేపీ నుంచి ప్రజలు కోరుకునేవి. కానీ హైదరాబాద్ పెద్దలకు మాత్రం ఇవి పట్టవు. తలోదిక్కు. ఎవరి రాజకీయాలు వారివి. ఎవరి గ్రూపులు వారివి. అర్వింద్ ఆది నుంచి అంతే. తన నిజామాబాద్లో తను చెప్పిందే వేదం. అక్కడ స్టేట్ పార్టీ పాలసీలు అమలు కావు. తన పాలసీలే అమలవుతాయి. ఈ విషయం ఎవరైనా రచ్చ చేసినా.. డోంట్ కేర్ అంటాడు. ఓ వైపు బీఆరెస్, బీజేపీ ఒక్కటి కాబోతున్నాయి.. వీరిద్దరు కలవబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో.. బీఆరెస్ మైలేజీని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తాడు.
పెద్దలు, సీనియర్లు కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉన్నా.. అది తమ పార్టీ పాలసీగా చూస్తూ ఎలాంటి కామెంట్లు చేయకున్నా.. అర్వింద్ నోరు మాత్రం ఆగదు. తిడుతూనే ఉంటాడు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీశ్… ఇలా అందరినీ. మొన్నటికి మొన్న సీఎం రేవంత్.. మీ రక్తం పారించాలి .. పొలాల్లో! అన్న మాటలు బీఆరెస్కు బాగా కలిసి వచ్చాయి.
దీన్ని తమ పొలిటికల్ మైలేజీ కోసం ఎంత చేయాలో అంత చేసింది బీఆరెస్. ఈ అంశంపై కనీసం బీజేపీ పెద్దలు అటు రేవంత్ను, ఇటు బీఆరెస్ను ఒక్క మాట అనలేదు. సైలెంట్గా ప్రేక్షకపాత్ర వహించారు. కానీ అర్వింద్ ఊరుకోలేదు. మీ పాపపు రక్తం మాకెందుకు నాయనా..! మీ రక్తమంతా ఇక్కడి ప్రజలను దోచుకు తినగా వచ్చినదే!నని తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు.
దీంతో ఇటు బీజేపీ నేతలతో పాటు అటు బీఆరెస్ నేతలూ అవాక్కయ్యారు. వీడెవడండీ బాబు..! మధ్యలో మా కాళ్లకడ్డం పడుతూ ఉంటాడు..! అని తిట్టుకున్నారట కూడా. అలా ఉంటుంది అర్వింద్తోటి. ఇది చాలదంటూ.. ఏ ఇంటర్వ్యూలకు పోయినా.. ముందు తమ పార్టీ నేతలనే తిడతాడు. వీళ్లకు చాతగాక గానీ, మా పార్టీని గెలిపించేందుకు జనాలు రెడీగా ఉన్నారు. వీరే మోడీపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మలుచుకునే విషయంలో ఫెయిలవుతూ వస్తున్నారని చెప్పేస్తాడు.
అంతే గాదు.. ఇప్పుడున్న స్టేట్ ప్రెసిడెంట్కు నోరు లేదని చెప్పేశాడు మొన్న. నోరున్న ప్రెసిడెంట్ కావాలి.. అని ప్రకటించాడు కూడా. త్వరలో రాబోతున్నాడని కూడా చెప్పుకొచ్చాడు. ఇండైరెక్టుగా తనే ఆ నోరున్న నేతను అని అర్థం వచ్చేలా.