కేటీఆర్ కు ఇదో అప్రెంటీస్ పీరియడ్ లాంటిదన్నమాట. కాలం అప్పుడు కలిసి రాలేదు. కానీ ప్రతిపక్ష హోదాలో పడ్డంక ఇలా ట్రయల్ రన్లు నిర్వహిస్తూ తమకు తాము మార్కులేసుకుని, జనం ఆమోదాన్ని పొందేందుకు ఈ సమయం ఇలా కలిసి వస్తుందన్న మాట. అర్థం కావడం లేదా? కేటీఆర్ను సీఎం చేయాలనేది కేసీఆర్ కోరిక. కానీ జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. అలా అతనితో అప్పుడు ప్రజా ఆశీర్వాద సభలు పెట్టించాడు. సందర్బమేమీ లేదు. జనం ముందు ఓ భారీ బహిరంగ సభ.. దీనికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్య అతిథి.. తెర వెనుక మొత్తం కేసీఆర్ డైరెక్షన్.
కానీ అంతా అనుకున్నట్టు జరగలేదప్పడు. కేటీఆర్ను సీఎం చేయడానికి అప్పుడు అన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేశాడు కేసీఆర్. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఓడారు. ఈ కాలాన్ని మొత్తం కేటీఆర్ రాజకీయ పరిణితికి, ఎక్స్పీరియన్స్కు, జనంతో మమేకమయ్యేందుకు ఇవ్వాలనుకున్నాడు కేసీఆర్. అందుకే ఇప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొత్తం పార్టీ బాధ్యతలు కేటీఆర్కు అప్పగించాడు. కేసీఆర్ చేయాల్సిన పనులు, నిర్ణయాలు.. పాల్గొనాల్సిన కార్యక్రమాలు .. అన్నీ కేటీఆర్కే అప్పగించాడు.
ఇకపై భారీ బహిరంగ సభల్లో కూడా కేటీయారే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. బీఆరెస్లో భారీ బహిరంగ సభలంటేనే .. అదొక చర్చ. కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలకు ఆ పార్టీ అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ సభల ద్వారా ఆ పార్టీకి బాగా మైలేజీ వస్తోంది. జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. తేదీని ప్రకటించిన తరువాత ఓ వారం పది రోజుల నుంచే సన్నాహాలు చేస్తారు. పగడ్బందీ ప్లానింగ్ ఉంటుంది. తెలంగాణ కళాకారుల ఆటాపాటా, ధూంధాం దరువులతో జనాన్ని ఉర్రూతలూగిస్తారు.
కేసీఆర్ ఎప్పుడూ ఆ సభలకు సమయానికి హాజరైంది లేదు. గంటలు గంటలు లేటుగా వస్తాడు. అయినా జనాలు కేసీఆర్ ఏం చెబుతాడా? అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. వారి ఆసక్తికి తగ్గట్టే తనదైన స్టైల్లో మాట్లాడి .. ఆ సభ ద్వారా పార్టీకి మైలేజీ తీసుకొస్తాడు కేసీఆర్. కానీ ఇప్పుడు కేటీఆర్ను రంగంలోకి దించాడు. ఎలాగూ తాను బయటకు రావడం లేదు. మొన్న జీవన్రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు మాత్రం వచ్చి.. ఆ సభలో ప్రసంగించి వెళ్లిపోయాడు.
అయితే ఈ సభలపై ఇకపై కేటీఆరే ముఖ్య అతిథిగా ఉండి.. కేసీఆర్ లేకున్నా.. భారీ సభలను నిర్వహించే సత్తా ఉన్నదని నిరూపించుకోవాలని కేసీఆర్ అభిలాష. కేసీఆర్ సభల కోసం ఆసక్తిగా చూసినట్టుగా.. కేటీఆర్ వచ్చినా.. కేటీఆర్ మాటలు వినాలన్నా.. జనంలో ఓ రకమైన ఆసక్తిని క్రియేట్ చేయడం ద్వారా తన తరువాత వారసుడు కేటీయారేనని, జనం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భావిస్తారన్నమాట. అందుకే మొన్న తొలిసారిగా వరంగల్లో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు కేటీఆర్తోనే చేపట్టారు.
ఈ సభకు కేసీఆర్ వస్తారని అంతా భావించారు. పార్టీ సీనియర్లు దగ్గరుండి మరీ ఈ సభ ఏర్పాట్లు చూశారు. కేటీఆర్ ప్రసంగం అయ్యే వరకు వారిలో ఓ రకమైన టెన్షన్ కనిపించింది. కానీ అనుకున్నంతగా ఆ సభ సక్సెస్ కాలేదు. రేపు సరూర్నగర్లో కూడా ఇదే తరహాలో యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది బీఆరెస్. మరి కేటీఆర్ ఈ వేదికను ఎలా ఉపయోగించుకుంటాడో..?