పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతది ఓ ప్రత్యేక శైలి. ఆమె లోకల్ భావోద్వేగాలను తన పార్టీ మైలేజీకి అనుకూలంగా మలుచుకోవడంలో చాలా సార్లు సఫలమయ్యారు. ప్రతిపక్ష పార్టీలను ఇరుకన పెట్టడం ఒకెత్తైతే.. బెదిరింపు ప్రసంగాలు ఆమెకు అదనపు మైలేజీని తెచ్చిపెట్టాయని చెప్పాలి. ఇక లోకల్ పబ్లిక్ పల్స్ ఎరిగిన నేతగా అక్కడి పరిస్థితులు, సంస్కృతులపై ఆమెకు పట్టుంది. అందుకే అవతలి పార్టీది అక్కడ సంస్కృతిని చెరిపేసే పార్టీగా ముద్రవేసి తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోగలుగుతుందనే మెసేజ్ ఇవ్వడంలో ఆమె చాలా సందర్బాల్లో సఫలీకృతులయ్యారు.
తాజాగా మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె.. అక్కడి సంసృతిలో భాగమైన చేపల కూరపై తనదైన శైలిలో మాట్లాడారు. తన ప్రధాన శత్రువైన బీజేపీని ఇరుకున పెట్టేందుకు.. హిందూత్వ భావజాలం ముసుగులో బ్రాహ్మణులు రాజ్యమేలే పార్టీగా బీజేపీని చిత్రీకరించే క్రమంలో ప్రజల ముందు ఆమె చేపల ఇష్యూను తన ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్ ప్రజల సంస్కృతిలో భాగమైన మాఛ్-బాత్ .. అంటే చేపల కూర అన్నాన్ని తిననివ్వరని ఆమె గట్టిగా జనంలోకి తీసుకెళ్లగలిగింది. ఈ ప్రమాదాన్ని బీజేపీ అప్పుడే పసిగట్టింది. ఆ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సువేందు అధికారి బ్రాహ్మణుడు.
ఇది కూడా మమత ప్రచారానికి బాగా కలిసి వచ్చింది. వీళ్లు అధికారంలోకి వస్తే మనల్ని శాఖాహారమే తినమంటారు. మన నిత్య జీవితంలో, మన జీవన సంస్కృతిలో భాగమైన చేపల భోజనాన్ని తిననివ్వరు.. అనేది ఆమె ప్రధాన ప్రచార అస్త్రంగా సువేందుపై సంధించారు. కానీ సువేందు.. దీన్ని ఖండిస్తూ వచ్చారు. మేము అధికారంలోకి వస్తే చేపల భోజనాన్ని అతి తక్కువ ధరకే అందిస్తామని చెబుతూ వచ్చారు. దీనికి ఎంత మంది అక్కడ కనెక్టయ్యారో లేదో తెలియదు. అక్కడ బీజేపీ గెలవడానికి చాలా కారణాలే ముడి పడి ఉన్నాయి. మమత పాలన, బీజేపీ ఓట్ల తొలగింపు.. హిందూ భావజాలం పెరగడం..చాలా ఇష్యూలున్నాయి. ఈ చేపల అన్నం.. ప్రచారాన్ని బెంగాల్ ప్రజలు పట్టించుకున్నట్టు లేదు.
మమత మాటలను వినలేదు. మొత్తానికి అక్కడ సీఎంగా సువేందు అధికారి సీఎంగా అయ్యారు. అందురూ అనుకున్నట్టుగానే. కానీ ఈ చేపల భోజనం విషయాన్ని మాత్రం ఈ సీఎం బాగా సీరియస్గా తీసుకున్నట్టున్నాడు సుమండీ! రూ. 5కే చేపల కూరతో భోజనం పెట్టే కార్యక్రమానికి వడివడిగా శ్రీకారం కూడా చుట్టేసి.. తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని చెప్పేక్రమంలో ఈ విషయంలోనైతే సక్సెసయ్యిందనే చెప్పాలి.
అదీ సువేందు దీనిపై ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదెవ్వరు. ముఖ్యంగా ఇది మమత వర్గానికి షాక్ నిచ్చిందనే చెప్పాలి. చేపల కూరనే తిననివ్వరని ప్రచారం చేస్తే.. ఆ సర్కారే ఇప్పుడు కొలువుదీరి.. ఏకంగా ఐదు రూపాయలకే చేపల భోజనాన్ని అందిస్తుండటం.. అక్కడి రాజకీయాల్లో చర్చకు తెర తీసింది.