కాళేశ్వరం నీళ్లు చచ్చినా ఇచ్చేలా లేదు సర్కార్. బీఆరెస్ ఎంత గగ్గోలు పెట్టినా.. బీజేపీ వంత పాడినా ఈ విషయంలో తన స్టాండ్లో తనుంది. ఇంకా ఇంకా వివరించే పనిలోనే ఉంది తప్ప.. రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పినా.. ఇంకెవరు చెప్పినా వినే పరిస్థితిలో సర్కార్ లేదు.
ఇవాళ ప్రెస్మీట్లో ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చాడు రేవంత్. ఇప్పటి దాకా మేడిగడ్డ వద్ద రెండు ఫిల్లర్లు కుంగాయి.. ఇక అది పనికి రాదు అని చెబుతూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు కొత్త రాగం అందుకున్నది. మేడిగడ్డనే కాదట.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా పనికిరావని ఎన్డీఎస్ఏ చెప్పిందని స్వయానా సీఎం రేవంత్రెడ్డే ప్రకటించడం చర్చకు తెరలేపింది.
రిటైర్డ్ ఇంజినీర్ల పేరుతో బీఆరెస్కు వకాల్తా పుచ్చుకుని, వారి వాయిస్ను వినిపించడం మూలంగా.. మేమేదో రైతులకు ద్రోహం చేస్తున్నట్టు.. బీఆరెస్ రైతుల కోసం పాటు పడుతున్నట్టు కలరింగు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని రేవంత్ విమర్శించారు. అంతే కాదు.. ఆ రిటైర్డ్ ఇంజినీర్లు కూడా ఈ కాళేశ్వరం అవినీతిలో భాగస్వాములని తిట్టిపోశారు. అప్పుడే మిమ్మల్ని జైలుకు పంపించక తప్పు పనిచేశానని అనడం కూడా చర్చకు తెర లేపింది.
ఎలాగూ రిటైర్ అయ్యారు కాబట్టి.. ఇలా ప్రెస్మీట్లు.. ప్రెస్నోట్లు అంటూ హంగామా చేస్తూ బీఆరెస్ పాట పాడుతున్నారు. ఆ కాళేశ్వరం కట్టే సమయంలో మీ అవినీతి పాత్రపై తేల్చకపోవడమే మేం చేసిన పెద్ద తప్పు.. అని ఓ రకంగా బెదిరింపు దోరణిలో సీఎం మాట్లాడటం గమనార్హం. ఎవరెన్ని చెప్పినా.. మాకు ఎన్డీఎస్ఏ రిపోర్టే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని అన్నాడు సీఎం.
అందుకే అది చెప్పినట్టే చేస్తాం తప్ప.. మా సొంత కవిత్వం, సొంత పైత్యం చూపించమన్నాడు. ఆ ఎన్డీఎస్ఏ కూడా ఇదే చెబుతున్నదని, ఎనభై వేల పుస్తకాలు చదివి ఉన్నవారు మా దగ్గర ఉన్నారు కాబట్టి.. మేం మాకు తోచించి చేస్తాం.. మాకు నచ్చినట్టు నడుచుకుంటాంటే చెల్లదు అని ఖరాఖండిగా ఎన్డీఎస్ఏ చెప్పిందని..కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు సీఎం రేవంత్.
ఓవైపు రిపేర్లకు ఓకే అంటున్నాడు. మరోవైపు టెస్టింగ్ చర్యలు కూడా షురూ అయ్యాయంటున్నాడు.. తప్ప.. ప్రతిపక్షాలు సూచించినవి పనికిరాని ఆలోచనల కిందే తీసిపారేశాడు రేవంత్. రిటైర్డ్ ఇంజినీర్ల సలహాలను తీసి చెత్తబుట్టలో పడేసినంత పనిచేశాడు. వారంతా బాగా అవినీతి సొమ్ము మెక్కి.. ఇప్పుడు బీఆరెఎస్ను కాపాడేందుకు వంతపాడుతున్నారని ఆ టీమ్ను చీప్గా తీసిపారేశాడు. దీంతో ఎంత లొల్లిపెట్టినా.. ఏం చేసినా.. తమ స్టాండ్ తమకే ఉందనే విధంగా ఆయన చెప్పుకొచ్చాడే తప్ప.. ఎక్కడా తలొగ్గలేదు.. ఓ రెండు మూడు మెట్లు దిగైనా వచ్చినట్టు కనిపించలేదు.
పైపెచ్చు.. తమ అధ్యయనంలో ఉన్న విషయాలనే మళ్లీ మళ్లీ తెలంగాణ జాతికి, రైతులకు వివరించే ప్రయత్నమే చేశాడు తప్ప.. ఎవరి మాటే వినే పరిస్థితిలో లేదు సర్కార్.. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది మరోదారి అన్నట్టుగానే ఉంది రేవంత్ వ్యవహారం అని అనుకుంటున్నా.. డోంట్ కేర్ అనే అంటున్నాడు ఆయన.