ఎల్నినో ఎఫెక్ట్ … కాళేశ్వరం లేని లోటు.. ! రైతాంగానికి ఏ విధంగా నష్టం చేస్తుందో చెప్పేందుకు బీఆరెస్ విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ రాజకీయ ఎపిసోడ్లో కాంగ్రెస్ను విలన్గా నిలిపేందుకు అన్ని వనరులు వాడుకుంటున్నది. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఏది పట్టించుకునే పరిస్థితిలో లేదు.
బీఆరెస్కు సడన్గా కన్నెపల్లి పంప్హౌజ్ ఎందుకు గుర్తొచ్చిందో తెలుసా? ఈ ఎల్నినో కరువు ఛాయల వల్లే. అవును.. ఇదే మంచి సందర్బమని తలచే…కాళేశ్వరం అవసరం ఇలాంటి పరిస్థితుల్లో ఎంతలా అవసరమనే విషయాన్ని చెప్పేందుకు దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారే తప్ప.. నిజంగా వారికి రైతులపై ప్రేమ ఉండి కాదు.
ఎందుకంటే.. ఎల్నినో ప్రభావం ఉందని తెలిసిన ఈ నేతలు విచ్చలవిడిగా వరి వేసుకోండని ముందే ఎందుకు ఊదరగొడతారు. సర్కార్ ఓ ఏడు రకాల వరి వంగడాలనే వేసుకోండని, అవే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నాయని చెబుతూ వస్తుంటే.. ఇదే అదునుగా భావించి… ఎందుకు వరి విస్తీర్ణం తగ్గించాలి..? ఎందుకు ఏడు రకాల వరి వంగడాలే వాడుకోవాలి..? వరిని పెంచండి.. ఇష్టమున్నట్టు వేసుకోండని ప్రెస్మీట్లు పెట్టి మరీ ఊదరగొట్టారు.
ఇప్పుడు మళ్లీ ఎల్నినోను ఇలా కాళేశ్వరానికి లింకు పెట్టి మాట్లాడుతున్నారు. కానీ బీఆరెస్ రాజకీయ వ్యూహాన్ని రేవంత్ గమనించాడు. అందుకే ఇవాళ క్లారిటీగా చెప్పాడు. మేం కరువు పరిస్థితులు అంచనా వేయలేక కాదు. ముందు జాగ్రత్తగా మా ప్రణాళికల్లో మేమున్నాం.. ఆరుతడి పంటలే వేయమని చెప్పాం. కానీ బీఆరెస్ రైతులను రెచ్చగొట్టింది. రైతులు నష్టపోయినా పర్వాలేదు వారికి రాజకీయ మైలేజీ రావాలె..! ఇదే వారి ఉద్దేశ్యం. రాజకీయ ప్రయోజనం.. అని కాంగ్రెస్ విడమర్చి చెబుతూ వస్తోంది.
అంటే.. ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది. వరి విస్తీర్ణం తగ్గడం లేదు. సర్కార్ సూచించినట్టుగా ఆరుతడి పంటలకు రైతులు పోలేదు. అంటే కరువు పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండుడు ఖాయం. సర్కార్ బద్నాం అవుతుందా? ఇది బీఆరెస్ తనకు అనుకూలంగా మలుచుకుని రాజకీయాలు చేస్తుందా? అనే విషయాలు పక్కన బెడితే.. రైతులు మాత్రం ఈ వానాకాలం సీజన్లో భారీగా నష్టపోతున్నారనే విషయం మాత్రం క్లారిటీ.