తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది…! అన్నట్టుగా కేటీఆర్ చేసే పనులన్నీ అట్లనే ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ సర్వేల లొల్లి. ఇది తెరపైకి తెచ్చింది కేటీయారే. ఓ మీటింగు పెట్టుకున్నారు. దేని కోసం…? సర్ ప్రక్రియ గురించి ఎలా ముందుకు పోవాలి? ఏం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి…? ఓటర్లకు ఏ విధంగా పార్టీ అండగా ఉండాలె..? అనే అంశాలపై.
కానీ అక్కడ కేటీఆర్ తీసుకున్న టాపిక్ ఏంటో తెలుసో…! సీఎం రేవంత్ రెడ్డి సర్వే చేయించాడట.. అందులో బీఆరెస్సే గెలవబోతుందని రిజల్టు వచ్చిందంట. అంతా సీఎంగా కేసీఆర్ కావాలని ఆ సర్వే రిపోర్టుట. పోనీ ఇది రహస్యంగానైనా తమ నేతలకు చెప్పి ఏదో ఉత్సాహం కలిగించాడనుకున్నాడా? అంటే కాదు.. బాహాటంగానే ప్రకటించాడు. అంతా మీడియాకు ఎక్కించాడు. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావించాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆరెస్కు 78 సీట్లు వస్తాయని సీఎం రేవంత్ చేపట్టిన సర్వే రిపోర్టులో వచ్చిందంట.. అని ఢంకా బజాయించాడు.
ఇక తిక్కరేగదా? రేవంత్కు. అందుకే ఖమ్మ రైతు ఆశీర్వాద సభను వేదికగా చేసుకుని రెడీ అయ్యాడు దాడి చేసేందుకు. వాస్తవానికి నిన్న సీఎం మాట్లాడిన మాటలన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి కాదు. చాలా అంశాలు అందులో కేటీఆర్ సర్వే డ్రామా వల్ల అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి.. ఇక కేటీఆర్కు ఖతార్నాక్గా గట్టి కౌంటర్ ఇవ్వాలని అనుకున్నాడు. అదే చేశాడు.
హరీశ్ను, కేటీఆర్ను, కేసీఆర్ను ఓ మారు మళ్లీ గట్టిగా అర్సుకోవడమే కాదు. ఈ మీటింగులో సీఎం రేవంత్ ప్రత్యేకంగా దాడి చేసిందేమిటంటే.. ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి? ఎన్ని గెలుస్తున్నాము? ఆ మిగిలినవే మీ సీట్లు.. ! ఇక రాబోయే రోజుల్లో మీ స్థానం అదీ! కేసీఆర్ను ఫామ్హౌజ్ నుంచి రానీయం. కేటీఆర్ ఏ దిక్కు లేకుండా అనాథ అవుతాడు? హరీశ్ బీజేపీలోకి జంప్ అవుతాడు..? ఇవన్నీ వరుసగా జోస్యాలు చెప్పాడు.
నేను చెప్పేవి అంచనాలు కావు.. జరిగి తీరుతాయనే ప్రాక్టికల్ లెక్కలని కూడా చెప్పాడు. గతంలో జరిగిన ఉదంతాలను వివరించాడు. కేటీఆర్కు ఏం తెలుసు? గబ్బు లెక్కలు.. గలీజు పనులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కేటీఆర్ సర్వే వల్లే వచ్చిన వాగ్దానాలు, వాడీవేడీ మాటలు, శపథాలు.. భవిష్యత్ వాణి పలుకులు.. !
అంటే రెచ్చగొట్టి మరీ కేటీఆర్ తిట్టుంచుకున్నాడన్నమాట. దీని వల్ల ఏదో రాజకీయ వ్యూహం రచిస్తున్నానని కేటీఆర్ భ్రమపడి ఉంటాడు. కానీ ఇది పూర్తిగా బూమరాంగ్ అయి కూర్చుంది. ఏకంగా సీఎం.. భద్రాద్రి రాముడి మీద ఆన.. మేమే మళ్లీ రాబోతున్నామని అని నొక్కి వక్కాణించడం.. జనాలను కూడా బాగా కనెక్టు చేసేలా ఉన్న మాటలుగా భావిస్తున్నారు. ఇప్పుడే ఈ దూకుడు ఇలా ఉంటే.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్ది ఇది తుఫానుగా మారి.. ఆ వరదలో పార్టీలు ఎటు కొట్టుకుపోతాయో.. నాలుకలు ఎలా మడతెడతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.