Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ మరోసారి హీట్ పెంచుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏకంగా 117 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఆయన ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు, భవిష్యత్తు వ్యూహాలకు పార్టీ శ్రేణుల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ఆట మొదలైంది..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలతో తామంతా ఏకీభవిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. “సీఎం రేవంత్ రెడ్డి అసలైన ఆట ఇప్పుడే మొదలుపెట్టారు. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయడం చాలా సరైన నిర్ణయం” అని ఆయన కొనియాడారు. తెలంగాణలో వరుసగా రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు ముఖ్యమంత్రికి ఉందంటూ రేవంత్ నాయకత్వంపై గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
టికెట్ల కేటాయింపు.. హైకమాండ్ దే తుది నిర్ణయం!
పార్టీలో టికెట్ల కేటాయింపు అంశంపై కూడా జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఎవరికి సీట్లు ఇవ్వాలనేది కేవలం ఒకరిద్దరి చేతుల్లో ఉండదని.. సీఎం, పీసీసీ చీఫ్, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ ముగ్గురూ కలిసి సంయుక్తంగా నిర్ణయిస్తారని చెప్పారు. ప్రజాదరణ, పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని పరోక్షంగా సూచించారు.
సర్వేలపై టెన్షన్ వద్దు..
ఇటీవల వస్తున్న రకరకాల పొలిటికల్ సర్వేలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. “ఎవరికి నచ్చినట్లు వారు సర్వేలు చేసుకుంటారు, వాటిని చూసి పార్టీ నేతలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు” అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పనితీరును సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం గమనిస్తున్నారని, ప్రజల్లో పట్టు కోల్పోకుండా ఉండటానికి పలువురు శాసనసభ్యులకు ఆయన వ్యక్తిగతంగా కీలక సూచనలు, సలహాలు ఇస్తున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు. మొత్తానికి 117 సీట్ల మిషన్తో రేవంత్ రెడ్డి వేస్తున్న అడుగులు తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో చూడాలి.
Also Read: దీన్నే అంటారు రియల్ బిజినెస్ మైండ్ అని.. నెటిజన్లను ఫిదా చేస్తున్న ఢిల్లీ వ్యాపారి వైరల్ వీడియో!