కాళేశ్వరం రచ్చ రాజకీయంలోకి అనుకోని అథితిగా వచ్చాడు ఈటల రాజేందర్. గతంలో ఆయన కేసీఆర్ పాలనలో ఆర్థిక మంత్రిగా చేసి ఉన్న నేపథ్యం కావొచ్చు.. హరీశ్, కేటీఆర్లో సత్సంబంధాలు కొనసాగించే అంశంలో కావొచ్చు.. ఆయన కాళేశ్వరం విషయంలో పాజిటివ్గా మాట్లాడిన తీరు ఇటు కాంగ్రెస్లో, అటు బీజేపీలో చర్చకు తెర తీశాయి.
దీనిపైనే ఇవాళ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టారు. మొన్నటి దాకా కాళేశ్వరం విషయంలో తలెత్తిన సమస్యలు, టెక్నికల్ ప్రాబ్లెంస్ అన్నీ పదే పదే చెప్పిన సీఎం… ఇవాళ మాత్రం ప్రత్యేకంగా ఈటల రాజేందర్ కోసమే ఇవన్నీ చెబుతున్నానని ప్రకటించడం గమనార్హం. ఆయన ఈ మధ్య కాళేశ్వరం గురించి పదే పదే కలగజేసుకుని మాట్లాడాన్ని సీఎం రేవంత్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు.
అంతా బాగానే ఉంది.. కానీ కావాలనే కాళేశ్వరం నీటిని రైతులకు వదలడం లేదనే విధంగా బీఆరెస్ తమను డ్యామేజీ చేసే విధంగా మాట్లాడటం, దీనికి ఈటల రాజేందర్ వత్తాసు పలకడం పట్ల రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రూపకల్పన, చట్టబద్దత గురించి వివరంగా చెప్పాడు సీఎం.
ఇది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది? దీని ఉద్దేశ్యమేమిటీ? కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు సారాంశమేమిటీ..? దాని ప్రకారమే నడుచుకోవాలనే చట్టం చెబుతున్న నియమ, నిబంధలన్నీ ఏకరువు పెట్టాడు సీఎం. ఈటల రాజేందర్ బీజేపీలో కీలకంగా ఉన్నారని, కేంద్ర పెద్దలతో కలిసి దీనిపై ఓ సారి చర్చించాలని కూడా సలహా ఇచ్చారు.
ఎన్డీఎస్ఏ చైర్మన్తో ఓ సారి మాట్లాడి దీనిపై మరింత క్లారిటీ తీసుకోవాలని, అవగాహన పెంచుకోవాలని కూడా ఈటలకు హితవు పలికారు రేవంత్. అంతే కాదు..దీనిపై సీబీఐకి ఎంక్వైరీ కోసం లెటర్ రాస్తే ఇప్పటి వరకు పట్టించుకోలేదని, ఎందుకు కేంద్రం తాత్సారం చేస్తుందో కూడా ఈటల రాజేందర్ బాధ్యత తీసుకుని.. దీన్ని ముందుకు తీసుకుపోయేవిధంగా చూడాలని సూచించారు.
ఈటల రాజేందర్ ఈ విషయంలో మధ్యలో జోక్యం చేసుకుని, పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి.. ఆయనకు రెండు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఒకటి..ఎన్డీఎస్ఏ ఏం చెబుతోంది..? ఓ సారి ఆ కమిటీతో భేటీ కావాలని. రెండోది సీబీఐ ఎంక్వైరీ త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని. ప్రభుత్వాన్ని ఉత్తగనే బద్నాం చేస్తే ఊరుకునేది లేదు అనే విధంగా పరోక్షంగా ఈటలకు వార్నింగ్ ఇస్తూనే.. దీనిపై మాట్లాడినందుకు నువ్వు చేయాల్సినవి ఈ రెండు ప్రధాన బాధ్యతలు ముందు అవి చేసి చూపించు..! ఆ తరువాత మాట్లాడు..! అనే విధంగా ఈటలను డిఫెన్స్లో పడేసే విధంగా సీఎం మాట్లాడారు.
ఫైనల్గా.. ఎన్డీఎస్ఏ రిపోర్టును అనుసరించే పోతున్నామని, రేపు రిపేర్లు చేపట్టాలన్నా మేం దాని సూచన మేరకు, వారి ప్రమేయంతోనే ముందుకు సాగుతామని, సొంత తెలివి, సొంత పైత్యాన్ని చూపబోమని చురకలంటించేలా మాట్లాడారు. ఇప్పటికీ కాళేశ్వరంను బాగు చేసేందుకు రెడీగా ఉన్నామని, రిపేరు చేసి నీళ్లు కూడా ఇస్తామని కానీ, అది ఎన్డీఎస్ఏ పర్యవేక్షణ, డైరెక్షన్లో మాత్రమేనని.. కండిషన్స్ అప్లై అన్నట్టుగా సీఎం ముక్తాయించారు.