ఆమె సాదాసీదాగా కనిపిస్తారు. ఎప్పుడూ నవ్వు ముఖంతో పలకరిస్తూ ఉంటారు. మంచి వక్తగా కూడా పేరు గడించారు. నవ్వుతూనే సెటైరికల్గా వేసే పంచులు ప్రత్యర్థులకు వెంటాడుతూ ఉంటాయి. అందుకే ఆమె వైఖరి, వ్యవహార తీరు అందరికీ ఇష్టమే. ప్రస్తుత రాజకీయాలలో ఆమెదో ప్రత్యేక శైలి. శాంతమూర్తిలా కనిపించే ఆమె.. అపర కాళీగా మారే సందర్భం చూడటం చాలా అరుదు. కానీ ఆమె కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. బిడ్డా నువ్వు ప్రశాంతంగా రిటైర్ కాలేవు.. అని ఖతర్నాక్ కామెంట్ చేశారు.
ఓ రకంగా ఈ వ్యాఖ్యలు ఆమె నోటి నుంచి వచ్చిన రోజు నుంచి ఇక అతనికి ప్రశాంతంగా నిద్ర కూడా కరువే అవుతుండొచ్చు. ఒకవేళ నువ్వు .. నేను ప్రశాంతంగానే రిటైర్ అవుతానని అనుకుంటే .. అది పొరపాటే! అనే కన్క్లూజన్ కూడా ఆమే ఇచ్చారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో బిడ్డా నిన్ను వదిలేది లేదు… అనే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించే విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం.. పెద్దలు చెప్పినట్టే ఓ చిన్న పొరపాటును (అసలు అది పొరపాటు కిందకు కూడా రాదేమో) భూతద్దంలో చూపి ఏకంగా రిజెక్ట్ చేయడం… సీట్ చోరీకి పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తడం.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దీనిపై ఎవరి స్థాయిలో వారు మాట్లాడారు. విమర్శించారు. ఖండించారు. దుమ్మెత్తిపోశారు. కానీ ప్రియాంక గాంధీ మాత్రం డైరెక్ట్ అటాక్ చేశారు. ఆమె చేసిన అటాక్ కేంద్ర ఎన్నికల అధికారి మీద కాదు.. పరోక్షంగా కేంద్ర పెద్దల మీదే! అవును.. ఆ వార్నింగ్ ఇన్డైరెక్టుగా మోడీ, అమిత్ షాలకే. అంత తీవ్రత ఉంది ఆమె చేసిన వ్యాఖ్యల్లో. వాస్తవంగా ఇలాంటి కామెంట్స్ ఆమె గతంలో ఎప్పుడూ చేసినట్టు లేదు. రాహుల్ గాంధీ కూడా తన పరిధికి లోబడే మాట్లాడుతూ ఉంటారు. హుందాతనం వీడి ఆయన మాట్లాడిన సందర్బాలు ఉండవు. అరుదు. అదే బాటలో తనదైన ప్రత్యేక శైలితో ముందుకు సాగుతున్నారు ప్రియాంక గాంధీ.
కానీ ఈ విషయంలో ఆమె స్పందించిన తీరుపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? తగిన గుణపాఠం చెప్పాల్సిందేననే అభిప్రాయాలు పార్టీలకతీతంగా వెలువడుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ పూర్తిగా తప్పుడు వ్యూహంతోనే పోయింది. దీని వల్ల అపకీర్తి తెచ్చిపెట్టుకున్నది. ఇప్పుడు తాజాగా ప్రియాంక చేసిన ఖతర్నాక్ కామెంట్స్ కూడా చర్చకు తెర లేపాయి. ఓ రకంగా తామే కేంద్రంలోకి రాబోతున్నాం.. బిడ్డా ఎవరినీ వదలబోమనే సంకేతాలుగా ఆమె మాటలను చూడాల్సి ఉంటుంది. ఆ ఒక్క కామెంట్లో ఆమె ఎన్నో సంకేతాలను ప్రజలకిచ్చారు. కేంద్ర పెద్దలకు పరోక్ష వార్నింగులిచ్చారు. చూస్కుందాం ఇక అని బరి గీసి యుద్దంలోకి దిగిన కాళీగా అవతారమెత్తినట్టుగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు.