తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. వచ్చి తీరుతుంది. మేమే ఇక.. అన్ని రాష్ట్రాలు నరుక్కుంటూ వచ్చాం.. ఇక తెలంగాణే మిగిలుంది.. అంటూ రోజు పగటి కలలు కనడమే సరిపోయింది ఇక్కడి బీజేపీ నేతలకు. ఒక్కరికంటే ఒక్కరికి బీజేపీని అధికారంలోకి తెచ్చే ఆలోచన, ఆ సత్తా ఉన్నట్టైతే కనిపించడం లేదు.
ఒకరికి మించి మరొకరు. అజ్ఞానంలో మాకు మేమే సాటి.. సరిలేరు మాకెవ్వరూ..! అన్నట్టుగా పోటీలు పడి నోరు విప్పుతున్నారు. తమ అజ్ఞానపు స్థాయిలను చాటుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులో చేరాడు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కనీస సోయి లేకుండా.. అసలు రాజకీయాలు ఎలా నడపాలో.. ఎలా నడుచుకోవాలో తెలియనితనమంతా వీరి వద్దే ఉన్నట్టు.. ఇంకా ఓనమాల స్టేజీ కూడా వీరు దాటనట్టుగా మాట్లాడుతుంటారు.
ఉన్నదున్నట్టుగా, వారికి ఏది అనిపిస్తే అది అలా వాగేస్తూ ఉంటారు. ఇలా వివాదాలను కొని తెచ్చుకుని, వ్యక్తిగతంగా వారి ఇమేజ్ డ్యామేజీ చేసుకోవడమే కాదు… నీడ నిచ్చిన పాపానికి, ఆ గుర్తుపై గెలిచిన కృతజ్ఞతగా బీజేపీని మరింత పాతాళంలోకి దిగజార్చి మరీ రుణం తీర్చుకుంటున్నారు. అక్కడ ఉద్యమం చేసింది విద్యార్థులు కాదట. ఉగ్రవాదులు.. పాకీస్తానీలు.. ఇంకా ఎవరెవరో అసాంఘీక శక్తులన్నీ వచ్చి చేరాయట.
సరే, ఇవి కాషాయ నేతలంతా అంటున్నవే అనుకో. కానీ ఇంకో అడుగు ముందుకేశాడు ఈ కొండా. పేరులోనైతే కొండ ఉంది గానీ, బుర్రలో మాత్రం చిటికెడు గుజ్జు కూడా లేనట్టుంది. అందుకే అన్నాడు.. మోడీ కాబట్టి సరిపోయిందయ్యా బాబు.. లాఠీచార్జితో వదిలాడు. అదే అమెరికా లాంటి విదేశాల్లోనైతే కాల్చి పారేసే వాళ్లే తెలుసా..? అని మోడీ మెహర్బానీ గురించి తెగ ఇదయి పోయి.. త్యాగశీలి.. లెవల్లో బిల్డప్ ఇచ్చి మరీ మాట్లాడాడు.
ఉద్యమకారులంతా పార్లమెంటుపై దాడికి పరుగులు తీస్తున్నారంట… అందుకే లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అందులో తప్పేముంది? అని సమర్థించుకున్నాడు. మోడీ పాలనను దెబ్బతీసేందుకు మతశక్తులు అన్నీ ఈ ఉద్యమం పేరుతో ప్రవేశించి దేశాన్ని విచ్చిన్నం చేయాలనే కుట్ర దీని వెనుక దాగుందని తీర్మానించేశాడు.
అన్నీ బాగానే కవర్ చేశాడు… షరా మామూలుగానే. ఎందుకంటే కొండాకు ముందే.. మన బీజేపీ తెలంగాణ నేతలంతా తమ సోయి, జ్ఞానం, ఉద్యమం పట్ల ఉన్న కమిట్మెంట్, విద్యార్థి ఉద్యమాలపై వారి నేపథ్యం.. ఏపాటివో వారి అనుభవాలను బయటపెట్టినట్టుగా.. కామెంట్లు చేసి దొరికిపోయారు. పలుచనయ్యారు. దిగజారిపోయారు అని అనిపించుకున్నారు.
కానీ కొండా మాత్రం విదేశాల్లోని ప్రజాస్వామ్యాన్ని కూడా ఇక్కడికి పట్టుకొచ్చాడు. అక్కడైతే కాల్చి పారేసేవారే తెలుసా..? అన్నాడు. అక్కడి బాధలు మనకెందుకయ్యా కొండా..? మన విద్యార్థుల సమస్య నిజమైనదా కాదా? వారు కోరింది న్యాయమైందా కాదా? పేపర్ లీకులతో విద్యార్థుల జీవితాలు ఆగమయ్యాయా లేదా? ఇవి ఆలోచించి మాట్లాడాలె కదా..? నువ్వూ ఓ తండ్రివేగా విశ్వం..
అయినా.. ఆ ప్రధాన్కు లేని బాధ.. మన ప్రధానికి లేని నామోషీ.. నీకెందుకయ్యా.. ఆ ఆవేశం ఎందుకంటావు..? ఆరిపోయే దీపానికి ఆశలెక్కువ అన్నట్టు.. ఈ మాటలన్నీ అని మళ్లీ గెలుద్దామనే..?