1980ల ప్రారంభంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్దే ఆధిపత్యం. అయితే.. పార్టీలో అంతర్గత విభేదాలు.. ముఖ్యమంత్రుల మార్పులు.. ఢిల్లీ అధిష్టానం నిర్ణయాలపై ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. అదే సమయంలో.. తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతో ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. సినీ రంగంలో నంబర్ వన్ హీరోగా ఉన్న నందమూరి తారక రామారావు..1982 మార్చి 29న రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు వారి ఆత్మగౌరవం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికలు రాగా, 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంచలన విజయం సాధించింది. కాంగ్రెస్ను ఓడించి.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక సినీ నటుడు పార్టీ పెట్టి.. ఇంత తక్కువ సమయంలో అధికారంలోకి రావడం దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా మారింది. అయితే, అనతి కాలంలోనే తెలుగుదేశం ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన నాదెండ్ల భాస్కరరావుతో వచ్చిన భేదాభిప్రాయాలు పార్టీని ఇరకాటంలో పడేశాయి.
ఎన్టీఆర్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు నాదెండ్ల. కానీ.. కాలక్రమంలో ఎన్టీఆర్ పాలనా శైలి, నిర్ణయాలపై ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. పార్టీలో అసంతృప్తి ఉందన్న చర్చ మొదలైంది. అది చివరకు..1984లో ప్రభుత్వ సంక్షోభానికి దారితీసింది. గుండె చికిత్స కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లిన సందర్భంలో నాదెండ్ల భాస్కరరావు.. తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని, ఆగస్టు 16, 1984న ఎన్టీఆర్ ప్రభుత్వాన్నిపడగొట్టారు. నాదెండ్ల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర సంక్షోభం నెలకొన్నది. దీనిపై ఢిల్లీ స్థాయిలో ఎన్టీఆర్ పోరాటం చేశారు. చివరకు నాదెండ్ల భాస్కరరావు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో సెప్టెంబర్ 16న మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Also Read: 1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!
Also Read: 1980 నుంచి 2026 వరకు.. తులం బంగారం ఎంత పెరిగిందో తెలుసా? లెక్కలు చూస్తే షాకే!