మీ అసెంబ్లీకి రానీయకపోతే.. మా అసెంబ్లీ లేదా? మాకు అసెంబ్లీ లేదా..? మాక్ అసెంబ్లీ నిర్వహించలేమా? అని అనుకుని ఉంటాడు కేటీఆర్. అందుకే మన తెలంగాణ భవన్లో మనమే ఓ మాక్ అసెంబ్లీ నిర్వహించుకుంటే పోలా? అని అనుకున్నదే తడువు..కానిచ్చేశారు.
సీఎంగా శ్రీనివాస్ యాదవ్, స్పీకర్గా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గా పల్లా రాజేశ్వర్రెడ్డిలు నటించేశారు. మంచి కామెడీ పండించారు. నవ్వులు పూయించారు. కాసేపు బబర్దస్త్ కామెడీని తలపించారు.
మొన్నటి దాకా సీరియస్గా ఆందోళనలు చేసీ చేసీ అలసిపోయి ఉంటారు. అందుకే కొద్దిసేపు సేద తీరుదామని అనుకున్నట్టున్నారు. ఇలా జబర్దస్త్ జోకులు వేసుకుని వారిలో వారే నవ్వుకున్నారు. జోకులేసుకున్నారు. పాత్రల్లో జీవించారు. పోటీలు పడి నటించారు. అంతా బాగానే ఉంది కానీ సీరియస్నెస్ ఇంచుక మాత్రం లేకపోవడంతో అంతా నవ్వులమయమే అయ్యిందా మాక్ అసెంబ్లీ.
కేటీఆర్ నవ్వును ఆపుకోవడానికే, కంట్రోల్ చేసుకోవడానికే సరిపోయింది. సీఎంను ఎగతాళి చేసేందుకే ఈ మాక్ అసెంబ్లీ పెట్టినట్టున్నారు. తలసాని పదే పదే తన పాత్రను మొత్తం కించపరిచేలాగా మలుచుకుని కేటీఆర్ ముఖంలో చిరునవ్వులు కురిపించేందుకు విశేషంగా నటించి మెప్పించే ప్రయత్నం చేశారు.
ప్రతిపక్ష పాత్రలు ప్రశ్నలు సంధిస్తుంటే.. అధికార పక్షం కూడా ప్రతిపక్షానికి జతకట్టి సర్కార్పై ఛలోక్తులు, విమర్శలు, వ్యంగ్యం దట్టించి మొత్తానికి జోకులు వేసుకునేందుకే ఎక్కువ ప్రయార్టీ ఇచ్చారు. కానీ అది వారితో సాధ్యం కాలేదు. జబర్దస్త్ కామెడీలా అనారోగ్యకర కామెడీ స్కిట్ నే తలపించిందది. మాక్ అసెంబ్లీ అంటేనే అట్లుంటది కదా? అంటారా? అంతే అంతే. జనానికి కూడా బోర్ కొట్టింది ఈ రాజకీయాలు చూసీ చూసీ.
అందుకే వారు కూడా కొద్ది సేపు రీల్స్ చూడటం ఆపేశారు. జబర్దస్త్కు ఏమాత్రం తీసిపోని విధంగా తెలంగాణ భవన్ మాక్ అసెంబ్లీ నవ్వులు కురిపిస్తుంటే వారిని చూసి జనమూ నవ్వుకున్నారు. అబ్బా.. బీఆరెస్ నేతల్లో ఇంత మంచి నటులున్నారా? అని కూడా అనుకుని ఉంటారు. కేటీఆర్ ఏ డైరెక్షన్ చేసినా అంతే.. కొంచెం చేయమంటే మనోళ్లు అతి చేస్తరాయె. మంచి మార్కులు కొట్టేసే క్రమంలో తమ నేత నెత్తికే సున్నం పెట్టే రకంగా అప్పుడప్పుడు బూమరాంగ్ అవుతూ ఉంటుంది. అది వేరే విషయం అనుకోండి.
మాక్ అసెంబ్లీ మాత్రం పని ఒత్తిడి నుంచి రిలాక్స్ కావాలనుకునే వారు తప్పకుండా చూడాల్సిన కామెడీ స్కిట్. కానీ కామెడీలో పడి.. మొన్నటి దాకా అంత సీరియస్గా సర్కార్ మీద పోరాడిన అంశాలన్నీ తమకు తామే పలుచన చేసుకున్నట్టు కాలేదా…? అనే చర్చ కూడా నడుస్తోంది. తలపండిన నేతలు, సీనియర్లు,ఇలా పిల్ల చేష్టలతో .. అసలైన వ్యంగ్యం వీడి.. ప్రజా సమస్యలపై సర్కార్ను నిలదీసే క్రమాన్ని వదిలి.. కేవలం సీఎంను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి.. తమలో తామే సంతోషపడి దీన్ని అయ్యిందనిపించారు. ఇదొక్కటే ఇందులో ట్రాజెడీ..