ఏపీలో గత ఐదేళ్ల పాలనలో జరిగినట్లు భావిస్తున్న భారీ మద్యం కుంభకోణం ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్లోని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంపై దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని ఆయన గృహంలో భారీ ఎత్తున సోదాలు చేపట్టిన అధికారులు ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాల కోసం జల్లెడ పడుతున్నారు. ఈ పరిణామం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారింది.
2019 నుండి 2024 మధ్య కాలంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మద్యం విక్రయాల్లో నగదు లావాదేవీలకే ప్రాధాన్యత ఇవ్వడం డిజిటల్ చెల్లింపులను పక్కన పెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో వచ్చిన మద్యం ఆదాయం ఎక్కడకు మళ్లింది? షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ జరిగిందా? అనే కోణంలో ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ఆ సొమ్మును అక్రమ మార్గాల్లో మళ్లించారనేది ప్రధాన అభియోగం.
సోదాలు జరుగుతున్న సమయంలో విజయసాయిరెడ్డి తన నివాసంలోనే ఉండటంతో ఈడీ అధికారులు ఆయనను నేరుగా విచారిస్తున్నారు. మద్యం పాలసీ తయారీలో ఆయన పాత్ర మద్యం సరఫరా చేసే కంపెనీలతో ఉన్న సంబంధాలు విదేశాలకు డబ్బు మళ్లింపు జరిగినట్లు భావిస్తున్న షెల్ కంపెనీల వివరాలపై అధికారులు ఆయన నుంచి సమాధానాలు రాబడుతున్నారు. సోదాల్లో భాగంగా ఆయన ఇంట్లోని కంప్యూటర్లు లాప్టాప్లు మొబైల్ ఫోన్లు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన హార్డ్ డిస్క్లను ఈడీ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
ఈ దాడుల్లో ఈడీ ప్రధానంగా మనీ లాండరింగ్ కోణాన్ని పరిశీలిస్తోంది. మద్యం సిండికేట్ల ద్వారా వసూలైన భారీ మొత్తాలను వివిధ బినామీ కంపెనీల పేరుతో పెట్టుబడులుగా మార్చారని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు అలాగే విదేశాలకు హవాలా మార్గంలో డబ్బు మళ్లింపు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కేసులో కేవలం విజయసాయిరెడ్డి మాత్రమే కాకుండా గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న మరికొందరు నేతలు అధికారుల పాత్రపై కూడా ఈడీ దృష్టి సారించింది.
ఈ మెరుపు దాడులు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండా ఇంత పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరగదని విపక్షాలు విమర్శిస్తుండగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు. ఈ సోదాల్లో లభించే డాక్యుమెంట్లు డిజిటల్ ఆధారాల ఆధారంగా రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అటు ఢిల్లీ మద్యం కుంభకోణం తరహాలో ఏపీలో కూడా సంచలనాలకు దారితీసేలా కనిపిస్తోంది.
ALSO READ: బీఆరెస్ చేసిన తప్పులు, లోపాలే కవితకు పాఠాలు! అవే కొత్త పార్టీకి మార్గదర్శకాలు…