Trump: ఒకర్ని చూసి మరొకరు ఫాలో కావడం అంటే ఇదేనేమో? ఈ ఫార్ములా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఆయన కూడా ఆ విషయంలో ఏపీ మాజీ సీఎం జగన్ ను ఫాలో అయినట్టు కనిస్తోంది. కేవలం అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ విషయంలో ట్రంప్ గురించి చర్చ జరుగుతోంది.
జగన్ బాటలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ విషయమై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైపోయింది. 250వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని అమెరికా పాస్పోర్ట్లపై డొనాల్డ్ ట్రంప్ ఫోటోను ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. జులైలో జరగనున్న చరిత్రాత్మక వేడుకల గుర్తుగా పాస్పోర్ట్లను పరిమిత సంఖ్యలో విడుదల చేయనున్నట్లు విదేశాంగ ప్రతినిధి టామీ పిగాట్ వెల్లడించారు. వైట్హౌస్ వివరాల మేరకు ప్రత్యేక పాస్పోర్ట్ల్లో అమెరికా స్వాతంత్య్ర ప్రకటన పత్రంపై ట్రంప్ ఫోటో ఉండనుంది. కింద ఆయన సంతకం బంగారు రంగులో మెరుస్తూ ఉండనుంది.
ఇక అమెరికా పాస్పోస్టుపై ట్రంప్ ఫోటో
దీనికితోడు అమెరికా వ్యవస్థాపకుల చిత్రాలు, జాతీయ జెండా వంటివి ఇందులో పొందుపరిచారు. అయితే ప్రత్యేక పాస్పోర్ట్ల కోసం దరఖాస్తు చేసుకునే పౌరుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయబోమని తేల్చిచెప్పింది ట్రంప్ ప్రభుత్వం. నార్మల్గా అయితే అమెరికా పాస్పోర్ట్లపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి చారిత్రక కట్టడాల ఫోటోలుంటాయి.
అధికారంలో ఉన్న నాయకుడి ఫోటోను పాస్పోర్ట్పై ముద్రించడం ఆదేశ సంప్రదాయాలకు విరుద్ధమని చాలామంది భావిస్తున్నారు. ఇదికాకుండా అమెరికా కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకాన్ని ముద్రించనున్నట్లు ఇప్పటికే ట్రెజరీ శాఖ ప్రకటన చేసింది. అదే జరిగితే అమెరికా కరెన్సీ నోట్లపై సంతకం చేయనున్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రకెక్కనున్నారు.
ఈ వేడుకల సందర్భంగా ట్రంప్ ముఖచిత్రంతో కూడిన ప్రత్యేక స్మారక నాణేలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. ట్రంప్ ఫోటోతో కూడిన పాస్పోర్ట్ చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2019-24 మధ్యకాలంలో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడా లేని మార్పులకు శ్రీకారం చుట్టారు అప్పటి సీఎం జగన్.
ALSO READ: అధికార పార్టీని వీడిన చింత!
విద్యార్థులకు ఇచ్చే పుస్తకాల బ్యాగులు, ఎంఆర్వో జారీ చేసే సర్టిఫికెట్లు, చివరకు రైతుల పట్టా పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటోను అధికారులు ముద్రించారు. దాన్ని వైసీపీ ఓ రేంజ్లో ప్రచారం చేసుకుంది. చివరకు భూమి సరిహద్దు రాళ్లపై కూడా జగన్ ఫోటోను ముద్రించారు అధికారులు. అందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని తొలగించేందుకు వందల కోట్లు ఖర్చు చేసిన విషయం తెల్సిందే. ఈ లెక్కన జగన్ మామ బాటలో ట్రంప్ మామ నడుస్తున్నట్లు కనిపిస్తోందని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలను ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకున్నారని అంటున్నారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ సైతం ఈ పని చేయలేదని, ఈ తరం నేతలకు ఇదోమి అలవాటోనని చర్చించుకుంటున్నారు.