అధికార కాంగ్రెస్ పార్టీని మొన్నటివరకు వేధించిన చింత వీడింది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పార్టీకి కలిసి వచ్చింది.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి బాటలు వేసింది. ప్రతిపక్షాలు అప్పటివరకు చేసిన విమర్శలు ఇక మూగబోయాయి. అది మరెంటో కాదు. మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోవడం. అంతకుముందు వరకు రేవంత్ కేబినెట్లో మైనార్టీ శాఖ మంత్రి లేరు.అదే వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించడంతో ఆగమేఘాల మీద సీఎం రేవంత్.. మాజీ క్రికెటర్, సీనియర్ నేత అజారుద్దీన్కు మంత్రి పదవిని కట్టబెట్టారు.మైనార్టీలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే సిద్ధాంతాన్ని సీఎం రేవంత్ సైతం నిలబెట్టుకున్నారు.
గతేడాది అక్టోబర్ నెలలో ఎమ్మెల్సీలుగా అజారుద్దున్, ప్రొఫెసర్ కోదండరాంలను రాష్ట్ర మంత్రి వర్గం నామినేట్ చేసింది. గవర్నర్ కోటాలో వీరిని నామినేట్ చేయడంతో వారు అధికారికంగా ఎమ్మెల్సీలుగా పరిగణించ బడాలంటే అందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తప్పనిసరి అయ్యింది. అయితే, గతంలో ఉన్న గవర్నర్ ఫైల్ను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారు. తీరా గత నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా వచ్చారు. ఆయన కూడా మొదట్లో ఈ ఫైల్ను ఆమోదించలేదు. ఫలితంగా ఈనెల 30 తర్వాత కూడా అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా గవర్నర్ ఆమోదించకపోతే ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ తన మంత్రిపదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం టెన్షన్కు గురైంది. ఈ క్రమంలోనే ముందు సీఎస్ రామకృష్ణరావు, మంత్రులు గవర్నర్ శుక్లాను కలిసి ఎమ్మెల్సీల ఫైల్ను ఆమోదించాలని కోరారు.ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించడంతో ఎట్టకేలకు ఆ ఫైల్ను శివప్రతాప్ శుక్లా ఆమోదించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజారుద్దీన్.. నాటి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. గోపీనాథ్ మరణంతో అక్కడ ఏర్పడిన ఉపఎన్నికకు మరోసారి అజారుద్దీన్ పోటీ చేయాలని భావించాడు. ఢిల్లీ లెవల్లో లాబీయింగ్ చేయించారు. అయినప్పటికీ ఆ సీటు బీసీ కోటాలో నవీన్ యాదవ్కు దక్కింది. అక్కడ మైనార్టీ ఓటర్లు చాలా మందే ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి సీఎం రేవంత్..చట్టసభలకు ఎన్నిక కాకముందే అజారుద్దీన్కు మంత్రిపదవి కట్టబెట్టారు. ఆ తర్వాత మైనార్టీ శాఖను కేటాయించారు.ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి బాటలు వేశారు. నాటి నుంచి ఆరు నెలలు పూర్తికావడానికి వస్తుండటంతో సీఎం రేవంత్, మంత్రి అజారుద్దీన్కు టెన్షన్ పట్టుకున్నది.
KCR : కేసీఆర్ చెప్పాల్సింది చెప్పేశారు?
తీరా సీఎం రేవంత్ రెడ్డి చొరవతో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఎమ్మెల్సీల ఫైల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, తెలంగాణ జనసమితి నేత కోదండరాం శాసన మండలిలో ప్రమాణస్వీకారం సైతం చేశారు. ప్రస్తుతం అజారుద్దీన్ మంత్రి పదవి సేఫ్ అని తెలుస్తోంది. ఎందుకంటే మంత్రిగా ప్రమాణం చేశాక 6 నెలలలోపు ఏదైనా చట్టసభకు ప్రాతినిధ్యం వహించాలి. కానీ, అటు ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఫైల్ కాస్త గవర్నర్ వద్దే ఉండిపోయింది. తీరా 30వ తేదీ గడిస్తే అజారుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది. అనగా 6 నెలలు గడిచే రెండు రోజుల ముందు గవర్నర్ అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. దీంతో అజారుద్దీన్ ఆరెండ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. మంత్రి పదవి సైతం సేఫ్గా
ఉన్నది.గవర్నర్ నిర్ణయంతో అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు అజారుద్దీన్లకు ఏర్పడిన చింత తీరినట్టు అయ్యింది.