Eko Movie Telugu Review : సందీప్ ప్రదీప్, సౌరభ్ సచ్దేవా, వినీత్, నరైన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ మలయాళ హిట్ సినిమా ‘ఎకో’. ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్లలో ఇది కూడా ఒకటి. దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇటీవలే నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ అయింది. మొదట్లో మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్ అయ్యింది. ఇక జనవరి 7 నుండి తెలుగుతో సహా డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులోకి వస్తాయని అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ అనుకున్న దానికంటే ముందుగానే డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులోకి వచ్చాయి. మరి తెలుగు ఆడియన్స్ ను ఈ మూవీ ఎంత వరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కేరళలోని కాట్టుకున్ను అనే మారుమూల అటవీ ప్రాంతంలో మలేషియాకు చెందిన మాలతీ (బియానా మోమిన్) ఒంటరిగా నివసిస్తుంది. ఆమెను చూసుకోవడానికి పీయూస్ (సందీప్ ప్రదీప్) అనే కేర్ టేకర్ని కొడుకులు నియమిస్తారు. అలాగే నమ్మకానికి మారుపేరు అయిన మలేషియా జాతి కుక్కలు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాయి. కానీ ఆమె భర్త, కుక్కలను పెంచేవాడు కురియాచన్ (సౌరభ్ సచ్దేవా) కోసం చాలా మంది సెర్చ్ చేస్తారు. అతని స్నేహితుడు మోహన్ పోతన్ (వినీత్) కూడా ఈ లిస్ట్ లో ఉంటాడు. ఓ క్రిమినల్ కేసు అనంతరం మిస్ అయిన కురియాచన్ తన కుక్కల సహాయంతో దట్టమైన అడవిలో దాక్కున్నాడని పుకార్లు వస్తాయి. కానీ అతని ఆచూకీ ఎవ్వరికీ తెలీదు. అసలు ఇంతమంది అతని కోసం ఎందుకు వెతుకుతున్నారు? పీయూస్, కుక్కల పాత్ర ఏంటి ఇందులో ? మలేషియా మహిళ కేరళలో ఒక్కతే ఎందుకు నివసిస్తోంది ? అన్నది తెరపై చూడాల్సిన స్టోరీ.
రచయిత బాహుల్ రమేష్, దర్శకుడు దింజిత్ అయ్యథాన్ ఈ సినిమాలో వాతావరణాన్ని ఆయుధంగా వాడుకున్నారు. కథను నెమ్మదిగా స్టార్ట్ చేసి, చివరి వరకూ ఉత్కంఠభరితంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇందులో భయం కాదు థ్రిల్ కీలక పాత్ర పోషిస్తుంది. సింపుల్ స్టోరీ లైన్ తో నాన్-లీనియర్ స్టోరీ టెల్లింగ్ సినిమాకు ప్లస్ పాయింట్. ప్రతి సన్నివేశం సీట్ ఎడ్జ్ ఫీల్ ఇస్తుంది. మలేషియా నేపథ్యం, కురియాచన్ – సోయి గతం కథకు బలాన్ని చేకూర్చాయి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ మొదటి భాగంలో కొంతమంది ఆడియన్స్ కు గందరగోళంగా అనిపించే ఛాన్స్ ఉంది. ఒకేసారి ప్యారలల్గా నడిచే సబ్ప్లాట్స్ వల్ల కొన్ని చోట్ల సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కథలోని ప్రతి లేయర్ అర్థం కావాలంటే ప్రేక్షకుడికి ఓపిక కావలసిందే. క్లైమాక్స్ బాగున్నప్పటికీ క్లియర్ ఎండింగ్ ఆశించే ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసే అవకాశం ఉంది.
నటీనటుల విషయానికొస్తే… సందీప్ ప్రదీప్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్స్ పెద్దగా లేకపోయినా బియానా మోమిన్ తన ఎక్స్ప్రెషన్స్ తో భావోద్వేగాలను బాగా వ్యక్తపరిచింది. ఇంకా వినీత్, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నారాయణ్ బాగా నటించారు. ఇతర నటీనటులు కూడా కథకు అవసరమైన స్థాయిలో బాగా నటించారు.
ఈ సినిమాకు సోల్ బాహుల్ రమేష్ రచన. అతను వాతావరణం, కథనాన్ని బేస్ చేసుకుని సస్పెన్స్ను మెయింటైన్ చేసిన విధానం ప్రశంసనీయం. దర్శకుడు దింజిత్ అయ్యథాన్ స్క్రీన్ ప్లే బాగుంది. సినిమాటోగ్రఫీ బాధ్యతను కూడా బాహుల్ రమేష్ స్వయంగా చూసుకోవడం మరో ప్లస్ అయ్యింది. విజువల్స్ బాగున్నాయి. ముజీబ్ మజీద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్లోగా ఆడియన్స్ ను సినిమాలో లీనం చేస్తుంది. నిర్మాణ విలువలు కథకు సరిపోయేలా ఉన్నాయి.
బాహుల్ రమేష్ స్క్రీన్ప్లే
బ్యాక్గ్రౌండ్ స్కోర్
నటీనటుల ఫర్ఫామెన్స్
అక్కడక్కడా సాగదీత
క్లైమాక్స్
మొత్తానికి… ఎకో ఎంగేజింగ్ మిస్టరీ థ్రిల్లర్.