Fridge Storage: ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లో ఫ్రిడ్జ్ నిత్యవసరంగా మారింది. మిగిలిన ఆహార పదార్థాలు, కూరగాయాలు, పాలు, పెరుగు, పండ్లు, నీరు ఇలా ప్రతీ ఒక్కదానిని ఫ్రిడ్జ్ లో భద్రపరుచుకోవడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇలా చేయడం ద్వారా ఆయా పదార్థాలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని అందరూ భావిస్తుంటారు. అయితే కొన్ని రకాల పండ్లను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఆయా పండ్లు పాడైపోవడమే కాకుండా.. వాటిలోని పోషకాలు, రుచి పోతాయని పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అరటిపండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి తొక్కలు చాలా వేగంగా నల్లగా, గోధుమ రంగులోకి మారిపోతాయి. ఫ్రిడ్జ్ లోని చల్లదనం అరటిపండు రుచిగా మారే ప్రక్రియను అడ్డుకుంటుంది. దీనివల్ల పండు లోపల మెత్తగా, నల్లగా అయిపోయి తినడానికి పనికిరాకుండా పోతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి అరటిపండ్లను ఎల్లప్పుడూ గది వాతావరణంలోనే ఉంచాలని సూచిస్తున్నారు.
ఎండకాలం వచ్చిందంటే చాలు కొందరు పుచ్చకాయను తీసుకొచ్చి నేరుగా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు. కానీ పరిశోధనల ప్రకారం.. పుచ్చకాయను కట్ చేయకుండా ఫ్రిజ్లో పెడితే అందులోని ‘లైకోపీన్’ వంటి కీలకమైన యాంటీఆక్సిడెంట్లు నశించిపోతాయి. అయితే కట్ చేసిన ముక్కలను మాత్రం కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగనీ ఎక్కువ సేపు ఫ్రిడ్జ్ లోనే ఉంచడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు.
పండ్లలో రా జైన మామిడిపండు.. సహజంగానే వేడి వాతావరణంలో పండుతుంది. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అవి పక్వానికి వచ్చే ప్రక్రియ ఆగిపోవడమే కాకుండా.. వాటి సహజమైన తీపి, సువాసన తగ్గిపోతాయి. మామిడిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద పేపర్లలో చుట్టి ఉంచితేనే మంచి రుచి వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
బొప్పాయి పండును కూడా ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. చల్లటి వాతావరణం వల్ల బొప్పాయి తొక్క ముడతలు పడి లోపలి గుజ్జు గట్టిగా మారిపోతుందని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అది సరిగ్గా మగ్గకుండా రుచిలేని నిర్జీవ స్థితిలో ఉండిపోతుందని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి బొప్పాయిని కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలని, అప్పుడే అది బాగా పండుతుందని చెప్పుకొస్తున్నారు.
యాపిల్స్ను ఫ్రిజ్లో పెడితే అవి ఎక్కువ రోజులు గట్టిగా ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఫ్రిడ్జ్ లోని చల్లదనం యాపిల్లో ఉండే సహజ ఎంజైములను దెబ్బతీస్తుంది. దీనివల్ల యాపిల్ లోపల ఉండే కరకరలాడే గుణం (Crunchiness) పోయి మెత్తగా అయిపోతాయి. కాబట్టి వీటిని కట్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: బట్టలు ఉతకడంలో కొత్త ట్రెండ్.. ఇలా చేస్తే కరెంట్, టైం రెండూ ఆదా
నిమ్మకాయలు, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వీటిని తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల వాటి తొక్కలపై మచ్చలు పడి లోపల రసం ఎండిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇవి త్వరగా కుళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read: వర్షాకాలం స్పెషల్.. ఏసీలో ‘డ్రై మోడ్’ ఆన్ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా?