Recharge Prices Hike: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) తమ మొబైల్ టారిఫ్లను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే 3 నుంచి 4 నెలల్లో రీఛార్జ్ ప్లాన్ల ధరలు 12 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్’ తమ నివేదికలో పేర్కొంది.
టెలికాం రంగంలో పోటీ తగ్గి మార్కెట్ స్థిరపడటం, కంపెనీలకు లాభదాయకమైన వాతావరణం ఏర్పడటమే ఈ పెరిగే ధరలకు ముఖ్య కారణాలని సెంట్రమ్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం దేశీయ టెలికాం రంగంలో కేవలం ‘3+1’ (మూడు ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ రంగానికి చెందిన బీఎస్ఎన్ఎల్) మాత్రమే సేవలందిస్తున్నాయి. 2016లో జియో రాకతో తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ.. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీల చేతికే దాదాపు 80 శాతానికి పైగా టెలికాం మార్కెట్ వచ్చింది. దీంతో రీఛార్జ్ ధరలను నిర్ణయించే సామర్థ్యం ప్రైవేటు కంపెనీలకు పెరిగింది.
దీనికితోడు గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణ కోసం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆ పెట్టుబడులపై వచ్చే రాబడిని మెరుగుపరుచుకోవాల్సిన ఒత్తిడి టెలికాం సంస్థలపై ఉంది. మరోవైపు కస్టమర్లు 2జీ నుంచి 4జీ, 5జీ నెట్వర్క్లకు మారడం, పోస్ట్పెయిడ్ చందాదారుల సంఖ్య పెరగడంతో.. అధికారికంగా ప్లాన్ల ధరలు పెంచకముందే ప్రతి యూజర్ నుండి వచ్చే సగటు రాబడి (ARPU) స్వల్పంగా పెరుగుతుందని టెలికాం సంస్థలు అంచనా వేస్తున్నాయి.
Also Read: కుమారుడు ఉదయనిధి అరెస్ట్.. సీఎం విజయ్పై విరుచుకుపడ్డ ఎం.కె. స్టాలిన్!
ధరల పెంపుపై టెలికాం కంపెనీలు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఒకవేళ 12 శాతం మేర పెంచితే మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన ప్రైవేట్ ప్లాన్ల ధరలు మారొచ్చు. ప్రస్తుతం రూ. 349గా ఉన్న 28 రోజుల వ్యాలిడిటీ గల సాధారణ ప్లాన్ ధర సుమారు రూ. 389కి చేరే అవకాశం ఉంది. రూ.899 వద్ద లభించే 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ సుమారు రూ. 1,007కి పెరగొచ్చని సమాచారం. ఇక వార్షిక ప్లాన్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం రూ. 3,599గా ఉన్న ఫ్రీ కాలింగ్, డేటా ప్లాన్ సుమారు రూ. 4,031కి చేరే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ 12 శాతం కాకుండా 15 శాతం టారిఫ్స్ పెంచితే.. రీఛార్జ్ ధరలు పైన పేర్కొన్న దానికంటే మరింత ప్రియం కానున్నాయి.
Also Read: మ్యూజిక్ లవర్స్కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!