Phone Resale: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటోంది. సరికొత్త మోడల్ మార్కెట్లోకి రాగానే పాత ఫోన్ను మార్చేసి కొత్తది కొనడం ట్రెండ్గా మారింది. అయితే పాత ఫోన్లను అమ్మే విషయంలో మాత్రం భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. ఇంట్లో వాడకుండా పడి ఉన్న పాత ఫోన్లను అమ్మేయడానికి దాదాపు 70 శాతం మంది భారతీయులు ఇష్టపడటం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యక్తిగత డేటా భద్రత, ప్రైవసీ భయాలు వారిని వెంటాడుతున్నట్లు తేలింది.
క్యాషిఫై సంస్థ 8000 మందిపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ముగ్గురు.. ఫోన్ ను అమ్మిన తర్వాత తమ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందేమోనన్న ఆందోళనను వ్యక్తం చేశారు. అప్పటివరకూ ఫోన్లలో ఉన్న బ్యాంక్ వివరాలు, పాస్ వార్డ్ లు, వ్యక్తిగత ఫొటోలు, రహస్య చాట్స్ బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లొచ్చన్న భయాన్ని వారు వ్యక్తం చేశారు.
అయితే ఫోన్ అమ్మకంపై ఎన్నో భయాలు ఉన్నప్పటికీ సర్వేలో పాల్గొన్న సగం మంది పైగా తమ పాత ఫోన్ విక్రయించినట్లు అంగీకరించారు. అయితే ఫోన్ అమ్మకం విషయంలో డేటా గోప్యత, భద్రత తమ తొలి ప్రాధాన్యమని 45 శాతం మంది మెుబైల్ యుజర్లు స్పష్టం చేశారు. 29.5 శాతం మంది మాత్రం ఫోన్ ధరకు ఫస్ట్ ప్రేయారిటీ ఇస్తామని సర్వేలో చెప్పుకొచ్చారు.
మరోవైపు ఫ్యాక్టరీ రీసెట్ ఫీచర్ పైనా సర్వేలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. 83 శాతం మంది పాత ఫోన్ ను రీసెట్ చేసే విక్రయించాలని సూచించారు. కానీ అందులో 41 శాతం మంది ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల ఫోన్ లోని డేటా మెుత్తం డిలీట్ అవుతుందన్న నమ్మకం తమకు లేదని పేర్కొన్నారు. పాత ఫోన్ లో తొలగించిన డేటాను తిరిగి తాము పొందామని మూడింట ఒకవంతు మంది సర్వేలో తెలిపారు. అందుకే ఫోన్ రీసేల్ విషయంలో కాస్త ఆందోళన చెందుతున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: పాత ఫ్యాన్లతో విసిగిపోయారా? ఈ ‘స్మార్ట్’ ఫ్యాన్లకు మారండి.. LED స్క్రీన్, రిమోట్ కంట్రోల్!
కాగా, వ్యక్తిగత డేటా భద్రతకు ఏదైనా రీసేల్ ఫ్లాట్ ఫామ్ ముందుకొచ్చి హామీ ఇస్తే.. తమ వద్ద ఉన్న పాత ఫోన్లను ధైర్యంగా అమ్ముకుంటామని సర్వేలో పలువురు పేర్కొన్నారు. అంతేకాకుండా తమ పాత ఫోన్ లోని డేటా మెుత్తం తొలగినట్లుగా ధ్రువీకరించే సర్టిఫికేట్ ఏదైనా ఇస్తే.. కొంత రుసుమును సైతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని 83 శాతం మందికి పైగా చెప్పారు. ఇందుకోసం కొంత ఫీజును సైతం చెల్లించేందుకు తాము సిద్ధమని 50 శాతం మందికిపైగా పేర్కొన్నారు. పాత ఫోన్ నుంచి డేటాను వెలికి తీసేవారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని మరికొందరు అభిప్రాయపడ్డారు.
Also Read: ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఉక్కపోతకు చుక్కలు చూపించే.. టాప్-5 కూలర్లు ఇవే!