ఆధార్ కార్డ్, దాని వినియోగంపై కేంద్రం ఎప్పటికప్పుడు నూతన విధానాలు తీసుకొస్తోంది. తాజాగా ఆధార్ కి సంబంధించి ఒక యాప్ ని రూపొందించింది. ఈ యాప్ ద్వారా ఆధార్ వినియోగం మరింత సులభంగా మారుతుందని తెలిపారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ యాప్ మన ఫోన్లో ఉంటే, భౌతికంగా మనం ఆధార్ కార్డ్ ని బయటకు తీసుకెళ్లాల్సిన పని లేదు. ఆధార్ ని చూపించండి, ఒరిజినల్ ఆధార్ ఇవ్వండి అని ఎవరూ మనల్ని ఒత్తిడి చేయరు. సింపుల్ గా ఫోన్ ద్వారానే పని పూర్తవుతుంది.
ఎలా పనిచేస్తుంది..?
ఉదాహరణకు మనం ఎక్కడికైనా హోటల్ కి వెళ్లి చెక్ ఇన్ అయ్యేటప్పుడు వాళ్లు ఆధార్ కార్డ్ అడుగుతారు. లేదా కొత్త సిమ్ కార్డ్ కోసం వెళ్తే అక్కడ కూడా ఆధార్ అడుగుతారు. అలాంటి సందర్భాల్లో మనం మన వెంట ఆధార్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మన ఆధార్ నెంబర్ వారికి చెప్పాలి. అవసరమైతే ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని కూడా వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడా అవసరం లేదు. మనం మన ఆధార్ కార్డ్ కూడా వెంట తీసుకెళ్లాల్సిన పనిలేదు. సింపుల్ గా వారి వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ ని మన ఫోన్ లోని ఆధార్ యాప్ లో స్కాన్ చేస్తే మన డిటెయిల్స్ అన్నీ వారికి చేరిపోతాయి. ప్రత్యేకంగా అథెంటిఫికేషన్ కూడా అవసరం ఉండదు.
గేమ్ ఛేంజింగ్ యాప్..
ఆధార్ వినియోగంలో ఇది ఒక గేమ్ ఛేంజింగ్ యాప్ అని కేంద్రం చెబుతోంది. క్యూఆర్ కోడ్ తోపాటు, ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది. ఏఐ ఆధారంగా దీన్ని తయారు చేశామని అంటున్నారు మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ యాప్ మన ఫోన్ లో ఉంటే ఆధార్ కార్డ్ ని భౌతికంగా మనం ఎక్కడికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
మన దేశంలో ఇప్పటికే ప్రతి షాప్ లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం క్యూఆర్ కోడ్ బోర్డ్ లు అందుబాటులో ఉన్నాయి. ఇకపై ఆధార్ ధృవీకరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారంతా కొత్త క్యూఆర్ కోడ్ బోర్డ్ లు తమ వద్ద ఉంచుకోవాలి. అప్పుడే ఆధార్ వెరిఫికేషన్ పూర్తవుతుంది. కొత్త ఆధార్ యాప్తో, వినియోగదారులు అవసరమైన డేటాను మాత్రమే షేర్ చేస్తారు. అంటే వారి వ్యక్తిగత సమాచారంపై వారికి పూర్తి నియంత్రణ లభిస్తుందన్నమాట. ఈ యాప్ ప్రస్తుతం బీటా పరీక్ష దశలో ఉంది. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆధార్ విషయంలో ప్రయోగాలు సరే, ఇవన్నీ కేవలం స్మార్ట్ ఫోన్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అది కూడా స్మార్ట్ ఫోన్ లో ఆధార్ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకునేవారికి మాత్రమే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. కీప్యాడ్ ఫోన్ లు వాడే వారికి, స్మార్ట్ ఫోన్ ఉన్నా కూడా అందులో యాప్ ఇన్ స్టలేషన్, ఇతర టెక్నాలజీ వాడటం చేతకానివారికి మాత్రం దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే రాబోయే రోజుల్లో దీన్ని ఒక గేమ్ ఛేంజింగ్ యాప్ గా కేంద్రం పరిగణిస్తోంది.