AI Glasses: నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంతలా దూసుకుపోతుందంటే.. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసేస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (AI) సామాజిక మార్పునకు ఓ శక్తివంతమైన సాధనంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కళ్లు లేనివారి జీవితాల్లో వెలుగులు నింపడానికి సరికొత్త AI స్మార్ట్ కళ్లజోడు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అంధులు కూడా ఎవరి సాయం లేకుండానే సొంతంగా నడవడానికి, చదవడానికి ఈ అద్దాలు తోడ్పడుతున్నాయి.
విశిష్టత కిమ్స్ ఫౌండేషన్, డీఆర్డీవో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ వి.భుజంగరావు నేతృత్వంలో ఈ స్మార్ట్ కళ్లద్దాలను రూపొందించారు. సుమారు రూ.10వేల ఖర్చుతో తయారైన ఈ అద్దాలలో కంప్యూటర్ విజన్, మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక ఆల్గరిథమ్స్ను ఉపయోగించారు. ఇవి కేవలం అద్దాల్లా మాత్రమే కాకుండా.. కళ్లులేని వారికి డిజిటల్ మార్గదర్శిలా పనిచేస్తాయి.
Also Read: రూ.60వేల లోపు టాప్-5 AI స్మార్ట్ఫోన్లు.. ఐఫోన్ నుంచి శాంసంగ్ వరకు అదిరిపోయే ఫీచర్లు!
ఈ కళ్లజోడులోని చిప్సెట్ సుమారు 400 మంది వ్యక్తుల ముఖాలను గుర్తు పెట్టుకుంటుంది. మనకు కావాల్సిన వ్యక్తుల పేర్లు, ప్రదేశాల వివరాలను దీనిలో ముందుగానే స్టోర్ చేసుకోవచ్చు. మనుషులు ఎదురుగా వచ్చినప్పుడు.. ఈ అద్దాలు వాళ్లని గుర్తించి ఆ వివరాలను వాయిస్ ద్వారా తెలియజేస్తాయి. దీంతో అంధులు తమ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ను సులభంగా గుర్తుపట్టగలరు.
ఇకపోతే ఈ ఏఐ గ్లాసెస్ టెక్ట్స్ టు స్పీచ్ టెక్నాలజీ పుస్తకాల్లోని అక్షరాలను, రోడ్డు మీద బోర్డులను చదివి వినిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే.. మీ గమ్యస్థానానికి సంబంధించిన వివరాలను యాప్లో నమోదు చేయడం ద్వారా, ఇవి దారిని చూపిస్తూ అడుగు తడబడకుండా నడిపిస్తాయి. ప్రస్తుతం 100 మంది విద్యార్థులకు వీటిని పంపిణీ చేయగా.. రానున్న రోజుల్లో మరింత మెరుగైన టెక్నాలజీతో ఇవి అందరికీ అందుబాటులోకి రానున్నాయి.
Also Read: అమెజాన్లో కళ్లు చెదిరే ఆఫర్.. సగం ధరకే శాంసంగ్ గెలాక్సీ S24 FE, మళ్లీ ఇలాంటి డీల్ రాదు!