Annual Recharge Plans: పెట్రోల్, డీజిల్ ధరల సెగతో ఇప్పటికే సామాన్యుడి జేబుకు చిల్లుపడుతుంటే.. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు కూడా అదే బాటలో పయనిస్తూ మోత మోగిస్తున్నాయి. నిత్యవసరంగా మారిన మొబైల్ డేటా, కాలింగ్ ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రతీ నెలా రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా.. ఏడాది పొడవునా నిశ్చింతగా ఉండేందుకు చాలామంది 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లను ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్టెల్ (Airtel), జియో (Jio), వోడాఫోన్ ఐడియా (Vi), బీఎస్ఎన్ఎల్ (BSNL) అందిస్తున్న వార్షిక ప్లాన్లు.. అందులో ఏది బెస్టో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జియో తన వార్షిక ప్లాన్ల ధరలను కూడా గట్టిగానే పెంచింది. ప్రస్తుతం జియోలో ఏడాది (365 రోజులు) వ్యాలిడిటీ ఇచ్చే మోస్తరు ప్లాన్ కోసం రూ.3,599 వరకూ చెల్లించాల్సిందే. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ప్రతిరోజూ 2.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అలాగే జియో టీవీ, జియో సినిమా వంటి యాప్స్ ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. 5G నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అర్హులైన వినియోగదారులకు అపరిమిత 5G డేటా కూడా వస్తుంది.
జియోకు గట్టి పోటీ ఇచ్చే ఎయిర్ టెల్ వార్షిక ప్లాన్స్ సైతం అంతే స్థాయిలో ఖరీదైనవిగా మారిపోయాయి. ఎయిర్టెల్లో ఒక ఏడాది పాటు ప్రతిరోజూ డేటా కావాలనుకునే వారి కోసం రూ.3,599 ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్లో రోజుకు 2 GB డేటా, అపరిమిత లోకల్ – ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఒకవేళ మీకు ప్రతిరోజూ డేటా అవసరం లేకుండా.. కేవలం కాల్స్, వ్యాలిడిటీ మాత్రమే ముఖ్యం అనుకుంటే.. ఎయిర్టెల్లో రూ.1,999 ప్లాన్ కూడా ఉంది. దీని ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో పాటు మొత్తం 24 GB డేటా.. ఫ్రీకాల్స్ లభిస్తాయి.
వోడాఫోన్ ఐడియా (Vi) కూడా జియో, ఎయిర్టెల్ల తరహాలోనే వార్షిక ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీఐలో 365 రోజుల వ్యాలిడిటీతో ఆకర్షణీయమైన బెనిఫిట్స్ ఇచ్చే ప్లాన్ ధర రూ.3,499 గా ఉంది. ఈ ప్లాన్ కింద యూజర్లకు రోజుకు 1.5 GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMSలు లభిస్తాయి. దీని ప్రత్యేకత ఏంటంటే.. ‘బింజ్ ఆల్ నైట్’ ఆఫర్ కింద అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి పరిమితి లేకుండా ఉచితంగా డేటాను వాడుకోవచ్చు.
Also Read: కల్వకుంట్ల కవిత సరికొత్త పొలిటికల్ స్కెచ్.. నేటి నుంచి పర్యటన..!
ప్రైవేటు టెలికాం సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) మాత్రం ఇప్పటికీ అత్యంత చౌకైన ప్లాన్లతో ఆకట్టుకుంటోంది. బీఎస్ఎన్ఎల్లో రూ.2,499 ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు ప్రతిరోజూ 2 GB డేటా, ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే ఈ ప్లాన్ దాదాపు రూ. 1,000 కంటే తక్కువ ధరకే లభిస్తుండటం గమనార్హం. అయితే బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వేగం మీ ప్రాంతంలో ఎలా ఉందో చూసుకుని ఈ ప్లాన్ ఎంచుకోవడం మంచిది.
Also Read: దేశంలో ఫస్ట్ టైమ్.. Airtel నుంచి సరికొత్త 5G టెక్నాలజీ.. రూ. 449కే అదిరిపోయే బెనిఫిట్స్!