Bhatti Vikramarka: తెలంగాణలో సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృత నిశ్చయంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి ప్రకటించారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద రూ.110 కోట్ల అంచనాలతో నిర్మించనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, నింబోలి అడ్డా వద్ద రూ. 25 కోట్ల అంచనాలతో నిర్మించనున్న ఎస్సీ హాస్టల్ కు సంబంధించి స్థల పరిశీలన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ రెండు భవనాలకు సంబంధించి ఆర్థిక, పాలనపారమైన అనుమతులు మంజూరయ్యాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ భవనాలు కేవలం భౌతికంగా కనపడే కట్టడాలు కావని.. వేలాది స్టూడెంట్స్ కు విజ్ఞానాన్ని అందించే దేవాలయాలు అని భట్టి కొనియాడారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను 10 అంతస్తులతో నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అంతేకాకుండా నింబోలి అడ్డా వద్ద మూడు అంతస్తులతో హాస్టల్ భవనాల నిర్మాణం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇది దళిత, నిరుపేద వర్గాల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు. ఈ భవనాలు రాష్ట్రంలో నాలెడ్జ్ పొందాలనుకునే అందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని తెలిపారు. ఈ భవనాల నిర్మాణంకు సంబంధించి ప్రతిపాదనలు పంపిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి పంపించడం జరిగిందన్నారు.
నాలెడ్జ్ సెంటర్ లో స్టడీ సర్కిల్స్, డిజిటల్ లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయని భట్టి స్పష్టం చేశారు. ఇవి విజ్ఞానాన్ని పంచే అత్యుత్తమ వేదికలగా నిలుస్తాయని అశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్వహించే కార్యకలాపాలను డిజిటల్ విధానంలో మారుమూల ప్రాంతాలకు చేర్చేలా బలమైన సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజక వర్గంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మిస్తున్నట్లు గతంలోనే ప్రకటించామని భట్టి గుర్తుచేశారు. పేద విద్యార్థులు కోచింగ్ కోసం హైదరాబాద్ రాకుండా సొంత నియోజకవర్గంలోనే ప్రిపేర్ అయ్యేందుకు ఈ నాలెడ్జ్ సెంటర్లు తోడ్పడతాయని స్పష్టం చేశారు.
Also Read: ‘ప్రస్తుత అధ్యక్షుని నియామకం చెల్లదు’.. హెచ్సీఏకి హైకోర్టు భారీ షాక్
హైదరాబాద్లోని మెయిన్ నాలెడ్డ్ సెంటర్ లో బెస్ట్ లెక్చరర్స్ చెప్పే పాఠాలను.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నిర్మించబోయే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల నుంచి ఆన్లైన్లో వినేలా చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులతో నాలెడ్జ్ సెంటర్ లో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత నిర్మాణాన్ని పూర్తిగా తొలగించడం కోసం రూ.5 కోట్ల నిధులను విడుదల చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం 2016లోనే దీనికి శంకుస్థాపన చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల నిర్మించలేకపోయిందన్నారు. కానీ తమ ప్రభుత్వం రూ.110 కోట్లతో దీనిని పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉందని భట్టి చెప్పుకొచ్చారు.
Also Read: Aero O2 Fan: సాధారణ ఫ్యాన్ కాదు బాబోయ్.. దీని ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!