AP Fibres: ఆంధ్రప్రదేశ్ ఫైబర్స్ లిమిటెడ్.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఉన్న ఏకైక ఇండస్ట్రీ ఇది. కానీ ఇదంతా గతం. ఎందుకంటే ఈ పరిశ్రమ మూతపడి ఏళ్లు గడుస్తున్నాయి. దీంతో అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించండి అనే డిమాండ్తో కార్మికులు ఎప్పటికప్పుడు డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వారి డిమాండ్ను పట్టించుకున్న నాథుడే లేడు. చాలా మంది నేతలు ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత మర్చిపోవడం కామన్గా మారిందనే చర్చ జరుగుతోంది.
సాలూరు సమీపంలోని జీగిరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫైబర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ గోనె సంచులు, జ్యూట్ ఉత్పత్తుల తయారీ కేంద్రం. ఒకప్పుడు కార్మికులతో కళకళలాడిన ఈ పరిశ్రమ ఇప్పుడు ఇలా మూసుకుపోయి దర్శనమిస్తుంది. ఈ ఒక్క మిల్లుపైనే ఆధారపడి సుమారు 240 కుటుంబాలు తమ జీవనం సాగించేవి. మిల్లు మూతపడటంతో వారంతా ఇప్పుడు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇది కేవలం ఫ్యాక్టరీ సమస్య మాత్రమే కాదు.. ఈ ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసే వందలాది మంది కార్మికులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయారు. ఒక పెద్ద పరిశ్రమ మూతపడితే దాని చుట్టుపక్కల ఉండే కిరాణా దుకాణాలు, రవాణా రంగం, హోటళ్లు వంటి చిన్న తరహా వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. స్థానికంగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో స్థానికులు అనేక ప్రాంతాలకు వలస వెళ్లారు. మధ్యవయస్సు దాటిన కార్మికులకు వేరే పనులు దొరకడం కష్టంగా మారింది. పిల్లల చదువులు, ఇళ్ల పెంపకం, ఆరోగ్య ఖర్చుల కోసం అప్పులపాలు కావలసి వచ్చింది. ఒకప్పుడు ఫ్యాక్టరీలో గౌరవప్రదంగా పనిచేసిన కార్మికులు, ప్రస్తుతం ఉపాధి హామీ పనులకు లేదా దినసరి కూలీలుగా మారి జీవనం సాగిస్తున్నారు.
Also Read: తిరుమలలో మళ్లీ బయటపడ్డ భద్రతా వైఫల్యం.. మొబైల్ వీడియోతో భక్తుడి హల్చల్!
గతంలో ఈ మిల్లు మూతపడినప్పుడు పలువురు నేతలు మద్దతుగా నిలిచారని కార్మికులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత అధికార పార్టీ నేతలైన సంధ్యారాణి సహా ఇతర నేతలు తాము దీక్షలో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించారని.. తమ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మిల్లును తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటిపోయినా తమని పట్టించుకున్న పాపాన పోలేదని చెబుతున్నారు. నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి.. తమ ఆకలి బాధలను అర్థం చేసుకోవాలని వారు కోరుతున్నారు. వెంటనే ఏపీ ఫైబర్స్ మిల్లును పునఃప్రారంభించి తమ కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ జూట్ మిల్ కార్మికుల సమస్యలు మాత్రం తీరడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజన్న దొరను కార్మికులు కలిసినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా జ్యూట్ మిల్లు తెరిపించి అందరి బతుకులు మారుస్తుందనే నమ్మకం చచ్చిపోతుందన్నారు. పాదయాత్ర సమయంలో నారా లోకేష్ కూడా ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి తమను పట్టించుకోవడంలేదనేది కార్మికుల ఆవేదన. ప్రభుత్వం వెంటనే స్పందించి జూట్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Also Read: Hydra Remarks: సీఎం రేవంత్ రెడ్డి మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తెలంగాణ.. ఎమన్నారంటే..?