Kalvakuntla Kavitha: ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎస్సీ 57 ఉప కులాల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఎస్సీల్లో 57 ఉప కులాలు ఉంటే అందులో 47 కులాలకు ఆర్డీవోలు క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేయడం అత్యంత విచారకరమన్నారు. అన్ని కులాలకు తహశీల్దార్ లే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.
సమాజంలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉప కులాల్లోని విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా గురుకులాల్లో సీట్లు కేటాయించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల్లోనూ ఉప కులాలకు ప్రత్యేక వాటా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎస్సీ ఉప కులాల్లోని కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్ లు ఇవ్వాలని కోరారు.
ఎస్సీ ఉప కులాల హక్కుల కోసం ఉద్యమిస్తా: కల్వకుంట్ల కవిత
ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన (TRS) ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆ పార్టీ చీఫ్ కవిత ప్రకటించారు. #SCSubCastes #KalvakuntlaKavitha #TelanganaPolitics pic.twitter.com/PHJo03addz
— BIG TV Breaking News (@bigtvtelugu) June 8, 2026
మరోవైపు గచ్చిబౌలిలోని లిడ్ క్యాప్ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం బడాబాబులకు కట్టబెట్టాలని చూస్తోందని కవిత ఆరోపించారు. ఆ భూములను తాము రక్షిస్తామన్నారు. జిల్లాల్లోని లిడ్ క్యాప్ భూములు రక్షించేందుకు అవసరమైతే ఉద్యమిస్తామన్నారు. అటు గ్రామ దేవతల ఆలయాల్లో దళిత పూజారులకు అవకాశం ఇవ్వాలని, గ్రామ దేవతల ఆలయాలకు ధూపదీప నైవేథ్యాల కోసం ప్రోత్సాహకాలు అందజేయాలన్నారు.
Also Read: ఓరేయ్ పాపిష్టోడా.. ఇదేం పనిరా.. పిల్లనిచ్చిన అత్తను పెళ్లాడిన అల్లుడు!
అనేక ఉప కులాల పేర్లు తప్పుగా గెజిట్ లో పేర్కొన్నారని కవిత ఆరోపించారు. వాటిని సవరించే వరకు ప్రభుత్వం వెంట పడతామని హెచ్చరించారు. ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తామని తెలిపారు. కాగా సమావేశంలో ఎస్సీ 57 ఉప కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు చింతల రాజలింగం, టీఆర్ఎస్ నాయకులు, 57 ఉప కులాల నాయకులు పాల్గొన్నారు.
Also Read: పెళ్లికి ముందు శారీరక బంధం పెట్టుకుంటే.. మంచోడు కాదని చెప్పలేం.. సుప్రీంకోర్టు సంచలనం