Aluminum Batteries: బ్యాటరీల వినియోగంలో విఫ్లవాత్మక మార్పులు తీసుకురాగల సరికొత్త సాంకేతికను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బెంగళూరులోని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ (CeNS) శాస్త్రవేత్తలు.. ఇతర సంస్థల పరిశోధకులతో కలిసి అల్యూమినియం బ్యాటరీల వినియోగానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. ఎక్కువ కాలం మన్నేలా చేసే ఒక కొత్త మిశ్రమ పదార్థాన్ని (New Composite Material) అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం – అయాన్ బ్యాటరీలతో పోలిస్తే.. ఇది ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో పాటు.. ఖర్చును కూడా భారీగా తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు.
సాధారణంగా అల్యూమినియం బ్యాటరీలలో ఉపయోగించే పదార్థాలు బ్యాటరీ ఛార్జ్ అవుతున్నప్పుడు లేదా డిశ్చార్జ్ అవుతున్నప్పుడు త్వరగా పాడైపోతాయి. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు బృందం.. వనాడియం ఆక్సైడ్ను (Vanadium Oxide) అత్యంత సన్నని, విద్యుత్ వాహకత కలిగిన ‘MXene’ అనే పదార్థంతో కలిపి ఒక కొత్త కేథోడ్ను రూపొందించారు. ఈ కొత్త మిశ్రమ పదార్థం.. బ్యాటరీ లోపల పగుళ్లు రాకుండా చూడటంతో పాటు ఎక్కువ కాలం మన్నేలా చేస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
సరికొత్త కేథోడ్ పదార్థాన్ని నింపిన అల్యూమినియం బ్యాటరీలపై పరిశోధనలు చేయగా సత్ఫలితాలు వచ్చాయని పరిశోధక బృందానికి నాయకత్వం వహిస్తున్న కవిత పాండే తెలిపారు. పరీక్షల్లో ఈ బ్యాటరీ 500 సార్లు రీఛార్జ్ చేసిన తర్వాత కూడా దాదాపు 59% సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే అల్యూమినియం చాలా చౌకగా లభిస్తున్నందున.. ఈ బ్యాటరీల తయారీ కూడా తక్కువ ఖర్చుతోనే అయిపోతుందని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే లిథియం – అయాన్ బ్యాటరీలతో పోలిస్తే.. అల్యూమినియం బ్యాటరీలు ఎంతో సురక్షితమైనవని పరిశోధకులు చెబుతున్నారు. పర్యావరణానికి సైతం మేలు చేస్తాయని పేర్కొంటున్నారు. లిథియం బ్యాటరీల లాగా పేలిపోయే ప్రమాదం వీటిలో ఉండదని స్పష్టం చేస్తున్నారు. తమ కొత్త ఆవిష్కరణ బ్యాటరీల రంగంలో విఫ్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఆశా భోంస్లే అంత్యక్రియలకు హాజరు కాని బాలీవుడ్ బడాబాబులు.. రీజన్ ఇదే?
ప్రస్తుతం మెజారిటీ స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లలోనూ లిథియం – అయాన్ బ్యాటరీలనే వినియోగిస్తున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో అల్యూమినియం బ్యాటరీలు అందుబాటులోకి రావొచ్చని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెుబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ ఇవి ముఖ్య భూమిక పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో అల్యూమినియం నిల్వలు పుష్కలంగా ఉండటం వల్ల మన దేశానికి ఈ పరిశోధన పెద్ద వరంగా మారుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.
Also Read: సుధీర్ కి అలాంటి సలహా ఇచ్చిన చలాకీ చంటి.. ఏంటో తెలుసా?