BSNL – Sanchar Mitra: దేశవ్యాప్తంగా కస్టమర్ సేవలను మరింత వేగవంతంగా, సుస్థిరంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆధారిత పాత వ్యవస్థలో ఎదురైన సాంకేతిక అంతరాయాలకు పరిష్కారంగా, సంస్థ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన కొత్త మొబైల్ అప్లికేషన్ ‘సంచార్ మిత్ర’ను అధికారికంగా ప్రారంభించింది.
ఈ యాప్ను ముఖ్యంగా కొత్త కస్టమర్ ఆన్బోర్డింగ్, SIM కార్డ్ జారీ, రీప్లేస్మెంట్ ప్రక్రియలను మరింత సులభంగా, వేగంగా నిర్వహించేందుకు అభివృద్ధి చేశారు. ఆధార్ ఆధారిత e-KYC ద్వారా కస్టమర్ గుర్తింపు ప్రక్రియను ఈ యాప్ మరింత భద్రంగా పూర్తి చేయగలుగుతుందని సంస్థ వెల్లడించింది. ఇక నుంచి ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేదు. ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుంది. దీంతో సిమ్ యాక్టివేషన్ వంటి ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా, సమయాన్ని ఆదా చేసేలా చేస్తుంది.
ఇంతకు ముందు BSNLలో కస్టమర్ నమోదు కోసం ఉపయోగించిన ‘సంచార్ ఆధార్’ యాప్ను ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసింది. అయితే, ఆ సంస్థతో ఉన్న ఒప్పందం గడువు ముగియడంతో, దేశవ్యాప్తంగా కొత్త SIMలు, రీప్లేస్మెంట్ SIMల జారీ ప్రక్రియలో తాత్కాలిక సమస్యలు తలెత్తాయి.
ఈ సంచార్ మిత్ర యాప్ను BSNL ఇంజినీర్లే అత్యవసర పరిస్థితుల్లో అభివృద్ధి చేశారు. దీంతో ప్రైవేట్ వెండర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి, డేటా భద్రత, సిస్టమ్ నియంత్రణ పూర్తిగా BSNL చేతుల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిందని సంస్థ తెలిపింది.
స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ యాప్ ద్వారా, బయటి సంస్థలపై ఆధారపడకుండా కీలక సేవలను కొనసాగించాలనే దిశగా BSNL ముందడుగు వేసింది. భవిష్యత్తులో కస్టమర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సాఫీగా, అంతరాయం లేకుండా సాగుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
అయితే ఈ సంచార్ మిత్ర యాప్ను రిటైలర్లు, ఫ్రాంచైజీల కోసం మాత్రమే రూపొందించారు. కస్టమర్లకు నేరుగా రీఛార్జ్ చేయడం లేదా బిల్లులు చెల్లించడం వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో లేవు.