భూమి గోళాకారంలో ఉంటుందనేది నిజం. కానీ ఆ గోళం సంపూర్ణంగా ఉండదనేది కూడా నిజం. అంటే భూమి ఆకారం మనం ఊహించుకున్నట్టుగా, ఫొటోల్లో చూసినట్టుగా ఉండదు. అక్కడక్కడ నొక్కుకు పోయినట్టు, మరికొన్ని చోట్ల ఉబ్బెత్తుగా ఉన్నట్టు కనపడుతుంది. అలాంటి ఆకారానికి కారణాలు అనేకం. భూమి గురుత్వాకర్షణ శక్తి ఆ కారణాల్లో ప్రధానం. భూమి ఆకారంలో ఎన్నో వింతలు విశేషాలు కూడా ఉంటాయి. అలాంటి వింతల్లో ఒకటి హిందూ మహా సముద్రంలో కనపడుతుంది. అక్కడ ఓ గురుత్వాకర్షణ రంధ్రం ఉంది. దీన్ని ఇండియన్ ఓషన్ జియోయిడ్ లో (IOGL) అని పిలుస్తారు. అంటే అక్కడ సముద్ర ఉపరితలంపై ఒక రంధ్రం పడినట్టుగా నీరు ఉంటుంది. చుట్టూ నీరు సమానంగా ఉన్నా, మధ్యలో మాత్రం లోయలా ఉంటుంది. భూమిపై పెద్ద గుంత పడితే ఎలా కనపడుతుందో సరిగ్గా సముద్రంలో పెద్ద గుంత పడినట్టు అక్కడ సీన్ ఉంటుంది. అయితే చుట్టూ నీరు ఉన్నా ఆ గుంతని మాత్రం అవి భర్తీ చేయవు. అదే విచిత్రం.
106 మీటర్ల లోతు..
IOGL అనే దృగ్విషయాన్ని 1948లో డచ్ శాస్త్రవేత్త ఫెలిక్స్ ఆండ్రీస్ వెనింగ్ మైనెస్ట్ కనుగొన్నారు. సముద్ర మట్టం అక్కడ అనూహ్యంగా దిగువకు ఉండటాన్ని గమనించిన ఆయన అది ఓ ప్రకృతి విపత్తుగా భావించారు. కానీ అప్పటికే అది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత దాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. చాలామంది శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లి పరిశోధనలు చేశారు కానీ దానికి గల కారణాలు చెప్పలేకపోయారు. ఈ IOGL దాదాపు 1.2 మిలియన్ల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంటుంది. పక్కనే ఉన్న సముద్ర మట్టానికి ఇది దాదాపు 106 మీటర్ల దిగువకు ఉంటుంది. అంటే ఆ తేడాని మనం స్పష్టంగా గమనించ వచ్చనమాట.
75 ఏళ్ల రహస్యం..
దాదాపు 75 ఏళ్లుగా ఇది రహస్యంగానే ఉంది. IOGL లో అంత భారీ గుంత ఎందుకు ఏర్పడిందనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆధునిక శాస్త్రవేత్తలు ఆ రహస్యాన్ని ఛేదించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISC) లోని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ లో జియో ఫిజిసిస్ట్ ప్రొఫెసర్ అట్రేయీ ఘోష్ ఈ రహస్య ఛేదనలో ముందడుగు వేశారు. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తో కలసి ఆమె మరిన్ని ప్రయోగాలు చేశారు. కొన్నేళ్లుగా ఈ పరిశోధన కొనసాగుతున్నా.. ఇటీవల జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురించబడిన వారి పరిశోధన ఫలితాలు అసలు కారణాన్ని వివరిస్తు్నాయి.
భూమి గురుత్వాకర్షణలో మార్పులు..
భూమి ఆకర్షణ అన్ని ప్రాంతాల్లో ఒకేరకంగా ఉండదు. దీన్ని గురుత్వాకర్షణ క్రమరాహిత్యం అంటారు. దీనివల్లే హిందూ మహాసముద్రంలో భారీ గుంత ఏర్పడిందని గుర్తించారు శాస్త్రవేత్తలు. అక్కడ గురుత్వాకర్షణ శక్తి భూమి మీద అత్యంత తక్కువ అని తేల్చారు. ఈ జియోయిడ్ ప్రభావం వల్ల సముద్రంలోని నీరు అక్కడ సమాంతరంగా ఉండదు.
భూమి నిలువు కోతలో క్రస్ట్, మాంటెల్, కోర్ ఉంటాయి. మాంటెల్ లో టెక్టోనిక్ ప్లేట్ ల కదలికలు ఉంటాయి. ఈ ప్లేట్ ల కదలికల వల్లే ఈ భారీ గుంత ఏర్పడిందని గతంలో శాస్త్రవేత్తలు ఊహించారు. ఆ ఊహను తాజా పరిశోధన కొట్టిపారేస్తోంది. అయితే మాంటెల్ లో లోహాలు ద్రవరూపంలో ఉంటాయి. ద్రవరూపంలోని లోహాలు ఒకచోట నుంచి మరోచోటకు కదిలే క్రమంలో ఉష్ణ ప్రసరణ కూడా జరుగుతుంది. ఈ ప్రసరణ వల్ల హిందూ మహాసముద్రంలో నీటి ప్రవాహాలలో విపరీతమైన తేడాలు కనపడుతున్నాయి. ఈ దృగ్విషయం హిందూ మహాసముద్రంలోని వింత గురుత్వాకర్షణ శక్తిని వివరిస్తుంది. ఇదే
భూకంప టోమోగ్రఫీ డేటాతో నడిచే సంఖ్యా నమూనాలను ఉపయోగించి, పరిశోధనా బృందం మాంటిల్ ఉష్ణప్రసరణను డ్రైవర్గా గుర్తించింది. భూమి లోపల ఈ నెమ్మదిగా, తిరుగుతున్న కదలిక వేడి, తేలికైన పదార్థాన్ని పైకి కదిలిస్తుంది మరియు చల్లని, బరువైన పదార్థాన్ని క్రిందికి లాగుతుంది. ఈ భారీ ప్రవాహాలు గ్రహం యొక్క ద్రవ్యరాశిని మొదటిసారిగా నమ్మకంగా మారుస్తాయి, ఇది హిందూ మహాసముద్రం యొక్క వింత గురుత్వాకర్షణ కనిష్ట స్థాయిని వివరిస్తుంది. 140 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం ఎలా ఏర్పడిందో ఊహించడానికి పరిశోధకులు సూపర్ కంప్యూటర్లను ఉపయోగించారు. ఖండాలు, మహాసముద్రాలు భిన్నమైన ప్రదేశాలలో ఉన్నట్టు సూపర్ కంప్యూటర్లు కొన్ని ఊహాచిత్రాలను అందించాయి. వాటి ద్వారా జరిగిన పరిశోధనలో మాంటెల్ లో ఉండే ఫ్లూమ్ సరిగ్గా IOGL కింది భాగంలో లేదని తేలింది. IOGL చుట్టూ ఈ ఫ్లూమ్ ఉంది. అంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి సరిగానే ఉంది. సరిగ్గా IOGL కింద గురుత్వాకర్షణ శక్తి అత్యల్పంగా ఉండటంతో ఇక్కడ భారీ గుంత ఏర్పడిందని తేల్చారు శాస్త్రవేత్తలు.