Air Conditioner: వేసవి కాలంలోని తీవ్ర ఎండలు, వడగాల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీలపై ఆధారపడుతున్నారు. అయితే, ఉష్ణోగ్రతలు 45°C దాటినప్పుడు ఏసీలపై భారం పెరిగి అవి పేలిపోయే ప్రమాదం (AC Blast) ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఏసీ పేలుళ్ల ఘటన ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అయితే ఈ సమస్యకు ‘వాటర్ మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్’ (Water Mist Cooling Systems) ఒక అద్భుతమైన పరిష్కారంగా నిలుస్తుందని సూచిస్తున్నారు. అది ఎలాగో ఈ కథనంలో పరిశీలిద్దాం.
సాధారణంగా ఏసీ అవుట్ డోర్ యూనిట్ ఇంటికి బయట ఉంటాయి. ఇవి ఇండోర్ యూనిట్ నుంచి వచ్చే వేడి గాలిని బయటకి పంపడం, బయటి గాలిని లోపలికి పంపి గదిని చల్లగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో బయటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగినప్పుడు ఆ ప్రభావం ఏసీ పనితీరుపై పడుతుంది. అవుట్ డోర్ యూనిట్ చుట్టుపక్కల ఉండే గాలి వేడెక్కినప్పుడు అది గదిలోని వేడిని బయటకు పంపడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ సమస్యకు మిస్ట్ సిస్టమ్ ద్వారా చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మిస్ట్ సిస్టమ్ ను ఉపయోగించి.. అవుట్ డోర్ యూనిట్ చుట్టపక్కల అతి సూక్ష్మమైన తుంపర్ల రూపంలో నీటిని స్ప్రే చేస్తారు. ఈ నీటి తుంపర్లు గాలిలోని వేడిని గ్రహించి ఆవిరి అవుతాయి. దీనివల్ల కండెన్సర్ చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత తక్షణమే 10°C – 15°C వరకు తగ్గుతుంది. అవుట్ డోర్ యూనిట్ పరిసరాలు చల్లబడటం వల్ల కంప్రెసర్ తక్కువ శ్రమతోనే గదిని వేగంగా చల్లబరుస్తుంది. ఇది విద్యుత్ బిల్లును కూడా తగ్గిస్తుంది.
ఏసీలోని కంప్రెసర్లు విపరీతమైన వేడిని తట్టుకోలేకపోవడం వల్ల ఏసీలు పేలుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి మిస్ట్ సిస్టమ్ చెక్ పెడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది కండెన్సర్ కాయిల్స్ను చల్లగా ఉంచి.. కంప్రెసర్పై పడే ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా కంప్రెసర్ లోపల ఉండే గ్యాస్ ప్రెషర్ పెరగకుండా ఇది అడ్డుకుంటుందని చెబుతున్నారు. దీనివల్ల షార్ట్ సర్క్యూట్లు, మితిమీరిన వేడి వల్ల జరిగే ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని వివరిస్తున్నారు.
Also Read: బడ్జెట్ ధరలో టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ కావాలా? అమెజాన్ సేల్లో అదిరిపోయే ఆఫర్లు!
ఇతర భారీ కూలింగ్ వ్యవస్థలతో పోలిస్తే మిస్ట్ సిస్టమ్ ఏర్పాటు తక్కువ ఖర్చుతో కూడికొని ఉంటుంది. ఇవి ఇవి చాలా తక్కువ నీటిని, విద్యుత్తును వినియోగిస్తాయి. మిస్ట్ సిస్టమ్ వల్ల ఏసీపై ఒత్తిడి తగ్గి.. అది ఎక్కువ కాలం సమర్థవంతంగా పనిచేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మరోవైపు వాటర్ సిస్టమ్ వాడేటప్పుడు నాణ్యమైన నాజిళ్లను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే స్ప్రే చేయడానికి మరీ ఉప్పుగా ఉన్న నీటిని వాడొద్దని చెబుతున్నారు. నీటిలో ఉప్పుశాతం ఎక్కువ ఉంటే.. కండెన్సర్ కాయిల్స్ తుప్పు పట్టే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read: వాషింగ్ మిషన్ వాడుతున్నారా? మీరు చేసే ఈ చిన్న తప్పు.. బట్టలను పనికిరాకుండా చేస్తున్నాయ్!