Elon Musk Warns to Apple Company: ప్రముఖ దిగ్గజ కంపెనీ అయినటువంటి యాపిల్ కంపెనీకి ఎలాన్ మస్క్ హెచ్చరిక చేశారు. మీరు అలా చేస్తే వాటిని నిషేధిస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థ యాపిల్ తాజాగా ‘వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్’ ను నిర్వహించింది. ఈ సమావేశంలో సంస్థ తమ ఉత్పత్తులకు తీసుకురానున్న అప్ గ్రేడ్ లను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఐఓఎస్ 18 సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ లో కృత్రిమమేధను జోడిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, యాపిల్ చాట్ బాట్ పరికరాల్లో చాట్ జీపీటీని అనుసంధానించడానికి ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకుంటామని తెలిపింది.
అయితే, ఎలాన్ మస్క్ దీనిపై స్పందిస్తూ హెచ్చరిక చేశారు. ఐఫోన్ ఓఎస్ కి ఓపెన్ ఏఐను అనుసంధానిస్తే తన కంపెనీ పరికరాలను ఇకమీదట అనుమతించబోమని సోషల్ మీడియా(ఎక్స్)లో పేర్కొన్నారు. ఇటువంటి స్పైవేర్ ను ఆపేయకపోతే తమ కంపెనీల్లో అన్ని యాపిల్ పరికరాలపై నిషేధం విధిస్తామని ఆయన హెచ్చరిక చేశారు. సంస్థలో యాపిల్ కు సంబంధించినటువంటి పరికరాలను ఇకమీదట ఉపయోగించమన్నారు.
Also Read: కొత్త ఫోన్ కొంటున్నారా..? ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ.. డోంట్ వెయిట్!
అదేవిధంగా ఆయన మరో పోస్ట్ కూడా పెట్టారు. అందులో మస్క్ కొంత వ్యంగ్యంగా పేర్కొన్నారు. యాపిల్ సంస్థకు సొంతంగా ఓపెన్ ఏఐని తయారు చేసుకునే సామర్థ్యం లేదని అనుకోవట్లేదన్నారు. సొంత ఏఐతో భద్రత, గోప్యత ఉంటుందన్నారు. అలాకాకుండా డేటాను ఓపెన్ ఏఐ అందజేస్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తదని హెచ్చరించారు. యాపిల్ తన పరికరాల్లో చాట్ జీపీటీని అనుసంధానించడం వల్ల వినియోగదారుల డేటా గోప్యతకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మస్క్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ప్రస్తుతం భారీగా చర్చ నడుస్తోంది. నెటిజన్స్ స్పందిస్తూ ఏఐతో అనుసంధానించడం వల్ల యాపిల్ సంస్థ ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటాయంటూ చర్చిస్తున్నారు.