Telegram Ban India: దేశవ్యాప్తంగా జూన్ 21న జరగనున్న నీట్ (NEET) రీ-ఎగ్జామినేషన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) పై భారతదేశంలో తాత్కాలికంగా ఆంక్షలు విధిస్తూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జూన్ 22, 2026 వరకు అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సుల మేరకు, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడటానికి మరియు ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడటానికి ప్రభుత్వం ఈ అత్యవసర చర్యలు తీసుకుంది.
Read also-భారత్ లో బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
ముఖ్యంగా పరీక్షకు ముందు సాగించే నకిలీ పేపర్ లీక్ ముఠాల అడ్డుకట్టకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని కేటుగాళ్ల ముఠాలు టెలిగ్రామ్ ఛానెళ్ల ద్వారా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ, నకిలీ ప్రశ్నపత్రాలను విక్రయించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అలాగే, పరీక్షకు ముందు విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం, ఆందోళన కలిగించే వదంతులు తప్పుడు ప్రచారాలు వ్యాప్తి కాకుండా నిరోధించడం కూడా ఈ నిషేధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
ఈ నిషేధంలో భాగంగా యాప్ పూర్తి బ్లాకింగ్తో పాటు టెలిగ్రామ్లోని ‘మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్’పై జూన్ 30 వరకు అదనపు ఆంక్షలు విధించారు. సాధారణంగా పరీక్ష ముగిసిన తర్వాత కొందరు దుండగులు పాత మెసేజ్లను ఎడిట్ చేసి, “తాము ముందే పేపర్ లీక్ చేశాం” అని తప్పుడు ఆధారాలను సృష్టించి సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నారు. ఇలాంటి సాంకేతిక దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికే ఈ ఎడిట్ ఆప్షన్ను కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ప్రభుత్వం ఆదేశించింది.
Read also-మార్నింగ్ వాక్ చేసేవారిలో ఈ ఆరోగ్య సమస్యలు తక్కువ.. ఫిట్గా ఉండాలంటే ఇవి తెలుసుకోండి
ఈ నిర్ణయం వల్ల సాధారణ టెలిగ్రామ్ వినియోగదారులకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును, జాతీయ స్థాయి పరీక్షల పవిత్రతను కాపాడటానికి ఈ తాత్కాలిక ఆంక్షలు తప్పనిసరని NTA పేర్కొంది. ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) లతో కలిసి ప్రభుత్వం భద్రతను మరింత కఠినతరం చేసింది. విద్యార్థులెవరూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కేవలం అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఫాలో అవ్వాలని అధికారులు సూచించారు.