సీనియర్ నేత షబ్బీర్ అలీ .. తన రాజకీయ చివరి మజిలీ విషాదంతో ముగియనుంది. ఆయన నోరు జారిన ఫలితం .. కాంగ్రెస్తో తెగదెంపులు తెంచుకున్నట్టే చేసింది. కామారెడ్డి రాజకీయతో ఎదిగిన షబ్బీర్కు.. అక్కడి రాజకీయాలే ఇప్పుడు రాజకీయంగా సమాధి చేశాయి. తనను దురదృష్టం వేటాడి వేటాడి చివరకు అంతం చేసే దిశగానే సాగిందని చెప్పాలి.
తనకు పోటీగా కామారెడ్డిలో గడ్దం చంద్రశేఖర్రెడ్డిని తీసుకువచ్చారని, కీలక పదవి ఇచ్చారనే కోపం.. ఫ్రష్ట్రేషన్గా మారి ఎవరో అనామకుడు ఫోన్లో అసంతృప్తి వ్యక్తం చేయడంతో తనలో గూడు కట్టుకున్న మాటలన్నీ బాహాటంగా బయటకు చెప్పేయడం.. ఇవన్నీ ఆయనకు తీవ్ర ప్రతికూలంగా మారాయి. కాంగ్రెస్లో ఇప్పుడు పక్కలేసుడు సంస్కృతి, డబ్బులకు పదవులిచ్చే సంస్కృతి ఉందని షబ్బీర్ అన్నాడు. ఇది ఫోన్ ఆడియో సంభాషణగా బయటకు వచ్చింది. దీనిపై కాంగ్రెస్లో కలకలం రేగింది. షోకాజ్ నోటీసులు జారీ చేసింది టీపీసీసీ.
దీనికి వివరణ కూడా ఇచ్చాడు షబ్బీర్. అవి తన మాటలు కావని, ఫేక్ ఆడియో అని అంతా అనుకున్నట్టే వివరణ ఇచ్చారు. కానీ దీన్ని అధిష్టానం పట్టించుకోలేదు. షబ్బీర్ మాటలతో పార్టీ డ్యామేజీ అయ్యిందనే విషయాన్ని స్పష్టంగా అంగీకరించింది అధిష్టానం. కానీ సస్పెండ్ చేయాలనుకోవడం లేదు. తన సీనియారిటీని పరిగణలోకి తీసుకుని పార్టీలో ఉన్నాడా? అంటే ఉన్నాడు. అంతే.. అంతకు మించి ఆయనకు బాధ్యతలు ఉండవు. పదవులు ఉండవు. టికెట్ ఉండదు. అసలు కాంగ్రెస్ లో ఆయనకు రాజకీయ భవిష్యత్తే ఉండదు.
ఇదీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం. ఆయనను ఇప్పటికే నిజామాబాద్ ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించారు. ఇప్పుడు కామారెడ్డి ఇంచార్జిగా ఉన్నారు. త్వరలో దీన్ని మార్చే అవకాశం ఉంది.ఇక ప్రభుత్వ సలహాదారు పదవితో పాటు వచ్చిన సంక్షేమ శాఖల్లో బీసీ సంక్షేమం వీహెచ్ హన్మంతరావుకు, మైనార్టీ సంక్షేమం అజారుద్దీన్కు ఇచ్చేశారు. ఇక ఉన్నది ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు. ఇవి కూడా ఇతరులకు కేటాయించేందుకు సమయం కోసం చూస్తున్నది అధిష్టానం.
పార్టీ వారి కోసం ఎంతో చేస్తే.. చివరకు ఇలా పార్టీని ఇబ్బంది పెట్టి.. పరువును బజారులో పెట్టి.. తమ రాజకీయ జీవితాలను తామే కాలరాసుకున్న లిస్టులో తాజాగా షబ్బీర్ కూడా చేరిపోయాడు.మైనార్టీ నేతగా కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చిన నేత.. ఇలా రాజకీయ జీవిత చరమాంకంలో తన చేతులారా దాన్ని విషాదంతో ఎండింగ్ చేసుకోవడమే ఆయన వర్గీయులకు పెద్ద విషాదం!