కార్ ప్రమాదాల్లో ప్రాణ నష్టం నివారించడానికి ఎయిర్ బ్యాగ్ ల వ్యవస్థ ఉంటుంది. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా అందులోని ప్రయాణికులు కొన్నిసార్లు చిన్న గీత కూడా పడకుండా బయటకొచ్చేస్తారు. కారు పోతే పోయింది, ప్రాణం మిగిలింది అని సంతోషిస్తారు. ఎయిర్ బ్యాగ్ లు అనేవి కారు ప్రమాదాల్లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ. అలాంటి ఆవిష్కరణను ప్లెయిన్ క్రాష్ లకు అప్లై చేస్తే ఎలా ఉంటుంది? విమాన ప్రమాదాలను నివారించేందుకు ఈ ఎయిర్ బ్యాగ్ వ్యవస్థ పనిచేస్తూందా? ఈ ప్రశ్నలకు సమాధానమే ప్రాజెక్ట్ రీబర్త్.
ప్రాజెక్ట్ రీబర్త్
ఎషెల్ వాసిం, దర్శన్ శ్రీనివాసన్ అనే ఇద్దరు భారతీయ యువ ఇంజినీర్ల ఆలోచన ఫలితమే ప్రాజెక్ట్ రీబర్త్. కొత్త ఏవియేషన్ భద్రతా వ్యవస్థను వీరు ప్రతిపాదించారు, ఇది ప్రమాదాల సమయంలో ఉపయోగపడే విపత్తు నివారణ సాధనం. AI-శక్తితో కలసి ఉన్న ఎయిర్బ్యాగ్లతో కూడిన క్రాష్ మిటిగేషన్ సిస్టమ్ గా దీన్ని పిలుస్తున్నారు. ఈ ఏడాది జూన్ లో జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత వీరికి ఈ ఆలోచన వచ్చింది. మెడికల్ కాలేజీ బిల్డింగ్ ని ఢీకొని ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. ఒక్కరు మినహా ఆ విమానంలో ప్రయాణించిన అందరూ స్పాట్ లోనే చనిపోయారు. అదే విమానానికి ఎయిర్ బ్యాగ్ వ్యవస్థ ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు యువ ఇంజినీర్లు.
ఇదే ముఖ్యం..
ప్రతి విమానంలో ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించాల్సిన ఉపకరణాలు అన్నీ ఉంటాయి. సాంప్రదాయ సీట్బెల్ట్లు, ఆక్సిజన్ మాస్క్లు, మరికొన్ని ఉపకరణాలు ఉంటాయి. కానీ క్రాష్ ల్యాండ్ అయినప్పుడు అవి ఎంతమేరకు పనిచేస్తాయి, వాటి వల్ల ఏమాత్రం ఉపయోగం ఉందనేదే అసలు విషయం. ఎయిరిండియా ప్రమాదంలో ఇవేవీ పనిచేయకుండా పోయాయి. ఇలాంటప్పుడు AI ఆధారిత ఎయిర్ బ్యాగ్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
ఎలా పనిచేస్తుంది?
ఈ ఎయిర్ బ్యాగ్ వ్యవస్థను AIతో అనుసంధానిస్తారు. విమానంలో సాంకేతిక వైఫల్యాలను గుర్తించడానికి AI నిరంతరం విమాన డేటాను విశ్లేషిస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినట్టు అనిపించినా వెంటనే ఎయిర్ బ్యాగ్ వ్యవస్థ అలర్ట్ అవుతుంది. కేవలం 2 సెకన్లలోనే ఎయిర్ బ్యాగ్ లు విచ్చుకుంటాయి. ఇవి విమానం ముందు భాగం, మధ్యలో, చివర్లో ఉంటాయి. ఒకవేళ విమానం క్రాష్ ల్యాండ్ అయినా ప్రమాద తీవ్రతను ఇవి పూర్తిగా తగ్గిస్తాయి. ఈ వ్యవస్థలో రివర్స్ థ్రస్ట్, బూస్టర్ లు ఉంటాయి. విమానం కిందికి పడిపోవడాన్ని ఇవి కాస్త ఆలస్యం చేస్తాయి. ఆలోగా పైలట్ కి ఆలోచించుకోడానికి కాస్త సమయం దొరుకుతుంది. ఇంపాక్ట్-హార్డెన్డ్ ఫ్లూయిడ్లు కూడా ఇందులో ఉంటాయి. ఈ ప్రత్యేక ద్రవాలు క్రాష్ ల్యాండ్ నుంచి ఉద్భవించే శక్తిని గ్రహించి విమాన క్యాబిన్ను రక్షిస్తాయి. రెస్క్యూ ఆప్టిమైజేషన్ అనే వ్యవస్థ ద్వారా ప్రయాణికులు ఎక్కడ చిక్కుకుపోయారనేది వెంటనే తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ రీబర్త్ కాన్సెప్ట్ దశలో ఉంది. దీన్ని దాటి ప్రోటోటైప్ పరీక్షలోకి వెళ్లాలని యువ ఇంజినీర్లు భావిస్తున్నారు. AI వ్యవస్థతో ప్రమాద పరిస్థితుల్ని కచ్చితంగా అంచనా వేయవచ్చని తెలుస్తోంది. ఇక విమానయాన సంస్థలు ఈ వ్యవస్థకు అయ్యే ఖర్చుపై తేల్చాల్సి ఉంది. విమానయాన అధికారుల నుండి కఠినమైన భద్రతా సర్టిఫికెట్లు లభిస్తే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టే.