Electronics Prices: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్, స్మార్ట్ టీవీలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. అయితే గత కొంతకాలంగా పెరుగుతున్న వీటి ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో వినియోగదారులకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD)ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల కంపెనీల ఉత్పత్తి వ్యయం తగ్గి, రాబోయే రోజుల్లో ఆయా డివైజ్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందనే ఆశలు చిగురిస్తున్నాయి.
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్ టీవీల తయారీకి అవసరమయ్యే డిస్ప్లేలు, లిథియం-అయాన్ సెల్స్, ఇండక్టర్ కాయిల్ మాడ్యూల్స్ వంటి కీలక విడిభాగాలపై ఈ పన్ను మినహాయింపు వర్తించనుంది. ఈ ప్రత్యేక మినహాయింపు 2029 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రస్తుతం భారత్.. డిస్ప్లే అసెంబ్లీలు, లిథియం-అయాన్ సెల్స్ వంటి కీలక భాగాల కోసం చైనా, వియత్నాం దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ డిపెండెన్సీని తగ్గించి ‘మేక్ ఇన్ ఇండియా’ను మరింత ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. పన్ను రద్దు చేయడం వల్ల దేశీయంగానే ఈ విడిభాగాల ఉత్పత్తి పెరిగి, విదేశీ దిగుమతులపై ఆధారపడటం క్రమంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఒక స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ తయారీ వ్యయంలో డిస్ప్లే అసెంబ్లీ, లిథియం-అయాన్ బ్యాటరీల వాటానే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ విడిభాగాల దిగుమతిపై 5% నుండి 7.5% వరకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉండేది. ఇప్పుడు ఈ పన్నును పూర్తిగా రద్దు చేయడంతో, కంపెనీలకు విడిభాగాల సేకరణ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఈ తగ్గింపు ప్రయోజనాన్ని కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేస్తే.. దేశంలో తయారయ్యే ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీల ధరలు ఆమేరకు భారీగా తగ్గే ఛాన్స్ ఉంది.
Also Read: సెలవుల్లో ఊరెళ్తున్నారా? కిచెన్ సింక్లో గ్లాస్ నీళ్లు.. తిరిగి వచ్చేసరికి జరిగేది ఇదే!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. దీనివల్ల స్టోరేజ్, మెమొరీ చిప్లకు డిమాండ్ విపరీతంగా పెరిగి తీవ్ర కొరత ఏర్పడింది. సరఫరా తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ చిప్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా యాపిల్, శాంంసంగ్, లెనోవో, డెల్ వంటి దిగ్గజ కంపెనీలు తమ డివైజ్ల ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. ఇలాంటి స్థితిలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. దేశీయంగా తయారయ్యే గ్యాడ్జెట్ల ధరలను నియంత్రణలోకి తెచ్చి వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తుందని మార్కెట్ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు.
Also Read: కంపెనీ vs లోకల్ మెకానిక్.. ఫ్రిజ్, ఏసీ, టీవీ పాడైతే.. ఎవరితో రిపేర్ చేయిస్తే బెస్ట్?